సీపీఎస్ రద్దు డిమాండ్ చేస్తూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నేతలు సీఎంఓ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయవాడ నగరాన్ని తమ వాలయంలోకి తీసుకున్నా పోలీసులు, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.మరోవైపు విజయవాడకు ఎవరినీ రానీయకుండా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఉపాధ్యాయులను నిర్బంధించారు. విజయవాడ వచ్చే అన్ని మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఉపాధ్యాయులు మారువేషాల్లో వచ్చే అవకాశం ఉండటంతో ప్రతీ ఒక్కరీ ఐడీ కార్డులు, సెల్ఫోన్ లను పరిశీలిస్తున్నారు. ఇక సామాన్య ప్రజలను సైతం ఆపి వెనక్కి పంపించేస్తున్నారు. బంధువులు చనిపోయారని, వెళ్లాలని కోరినా పోలీసులు పట్టించుకోని పరిస్థితి విజయవాడలో నెలకొంది. కాగా పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం విచారణ కూడా చేయకుండా వెనక్కి పంపడం ఏమిటని మండిపడుతున్నారు. అటు యూటీఎఫ్ సీఎంఓ కార్యాలయం ముట్టడిని సీరియస్గా తీసుకున్నా విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణాటాటా, యూటీఎఫ్ ఉపాధ్యాయులు తలపెట్టిన నిరసనలకు ఎటువంటి అనుమతులు లేవని సీపీ స్పష్టం చేశారు.
నిజానికి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 150 వారాలు దాటుతున్నా ఇప్పటి వరకు ఆ హామీ పై కనీసం మాట కూడా మాట్లాడడంలేదని సీపీఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పాను అని చెప్పిన జగన్ ఇప్పుడు సీపీఎస్ విషయంలో మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్యయన కమిటీ పేరుతో పీఆర్సీ మాదిరిగానే సీపిఎస్ విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరించాలని చూస్తోందని అంటున్నారు. ఇక న్యాయమైన తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యోగులను, ఉపాధ్యాయులను అరెస్ట్ చేయించడాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను చవిచూడక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్ళు సాగిస్తారని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న యూటీఎఫ్ నేతలను, సిపిఎస్ ఉద్యోగ సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించడాన్ని లోకేష్ తప్పుబట్టారు. ‘‘ వారం రోజుల్లో సిపిఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి గారు? ఉపాధ్యాయుల పట్ల వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చెయ్యండి’’ అంటూ లోకేష్ డిమాండ్ చేశారు.