సీపీఎస్ ఉద్యోగుల పట్ల జగన్ ప్రభుత్వం ప్రతీకార ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు. పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పీఆర్సీ, ఇతర డిమాండ్ల విషయంలో ఉద్యోగులతో కలిసి ఉపాధ్యాయులు ఉద్యమం చేపట్టారని, ఇప్పుడు సీపీఎస్ రద్దు కోసం ఆందోళన చేస్తున్నారని వివరించారు.ఇదివరకు తమకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారన్న కారణంగానే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటోందని ఆయన విమర్శించారు.
తమ హక్కుల కోసం సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపేందుకు వస్తుంటే అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సమైక్య పోరాటం చేయడం కుదరదనేలా ఉపాధ్యాయులను అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. హక్కుల కోసం ఉద్యమించడం తప్పా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. ఇక విద్యాసంవత్సరాన్ని జగన్ సర్కార్ జూన్ 12 నుంచి జులై 8కి మార్చడం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి పద్దతి దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో ఉపాధ్యాయులు మే 20 వరకు పనిచేయాల్సిందేనని, ఆ తర్వాతే సెలవులు అని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.