అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంత కటదిట్ట భద్రత మధ్య జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ మంది హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బైడెన్ 17 కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. కొవిడ్ నియంత్రణకు సంబంధించి తొలి సంతకం చేశారు. 100 రోజులు మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. వ్యాక్సిన్లను వేగంగా అందుబాటులోకి తెచ్చేలా కొన్ని ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. కొవిడ్ రెస్పాన్స్ కోఆర్డినేటర్ని నియమించారు. బైడెన్ సంతకం చేసిన 17 అంశాల్లో 9 ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నిలిపివేత ఉత్తర్వులే ఉండడం గమనార్హం. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వర్ణ సమానత్వం, పారిస్ పర్యావరణ ఒప్పందంలో చేరిక, మారటోరియం కొనసాగింపు, విద్యారుణాలపై వడ్డీ తత్కాలిక నిలిపివేత, ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి పౌరుల రాకపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేత, నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ రద్దు (మెక్సికో గోడ నిర్మాణానికి నిధుల సేకరణకు ఉద్దేశించింది), జనాభా సేకరణలో పౌరసత్వ నిబంధనల సడలింపు లాంటి ఉత్తర్వులున్నాయి.
ట్రంప్ లేఖ..
కాగా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడికి రాసిన లేఖలో ఉన్న సారాంశాన్ని బైడెన్ వివరించారు. తనకు ట్రంప్ శుభాకాంక్షలు చెప్పారని, తనకు మద్దతుగా ఉంటానని, పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నానని ఆ లేఖలో ట్రంప్ రాశారన్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ లేఖ ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం చాలా సంతోషమని వ్యాఖ్యానించారు.
ప్రసంగంలో..
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక.. బైడెన్ తొలిసారిగా ప్రసంగిస్తూ.. ‘అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ఇది. అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ రక్షణ ప్రథమ అంశం. ప్రజలకు చేయగలినంత సేవ చేస్తా. అధికారం కోసం కాదు.. అవకాశాల కోసం పాటు పడాలి. వ్యక్తిగత లాభం ప్రాధాన్యం కాదు.. ప్రజా సంక్షేమమే ప్రాధాన్యం. అంతా కలిస్తే ఒక కొత్త చరిత్రను రాయవచ్చు. విభేదాలకు, విద్వేషాలకు తావులేని సమైఖ్య జీవనంతో కొత్త వెలుగులు తీసుకువద్దాం. నన్ను విశ్వసించండి. ఎప్పుడూ సత్యమే చెబుతాను. నిజాయితీగా ఉంటాను.’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగం మొత్తంలో దేశ రక్షణ, వైషమ్యాల తొలగింపు, జాతి విద్వేషాల తొలగింపు, అమెరికా పౌరుల రక్షణ, ప్రపంచానికి దిశానిర్దేశం, విద్య, ఉపాధి అవకాశాల కల్పన, విదేశీ పౌరులకు వెసులుబాట్లు, పేద దేశాలకు బాసట ప్రధానాంశాలుగా ఉన్నాయి.
ముందుగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం
అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అరగంట ముందునే.. 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ (56) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా , భారతీయ మూలాలున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ‘ ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు సత్యనిష్టతో బాధ్యతలు నెరవర్చుతానని’ ప్రమాణం చేశారు.
సెనెట్ కమిటీ కీలక నివేదిక..
కాగా బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ముందు సెనెట్ కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు, చేయాల్సిన ప్రసంగాల్లో ఆ నివేదిక ప్రభావం చాలా ఉంటుంది. ఈ నివేదికలో పలువురు సెనెటర్లు.. చైనాను నమ్మలేమని, భారత్ విశ్వసించదిగిన దేశమని పేర్కొన్నారు. భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న బలమైన ద్వైపాక్షిక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికనూ కమిటీ రూపొందించింది. సెనెటర్లు ఆంటోనీ బ్లింకెన్(విదేశీ వ్యవహారాలు-మంత్రి), లాయిడ్ ఆస్టిన్ (డిఫెన్స్ మంత్రి), అవ్రిల్ హెనెస్ (నిఘా, CIA విభాగం) తదితరులు ఈ మేరకు సెనెట్ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ కమిటీ ఆమోదించడం జరిగాయి. ఈ నివేదికలో భారత్, ఆస్ట్రేలియా, జపాన్ల కూటమిని బలోపేతం చేయడం, భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను అడ్డుకునేలా ఆయా దేశాలపై ఒత్తిడి తేవడం, తైవాన్ను ఆక్రమించుకునే యత్నం చేస్తున్న చైనాను కట్టడి చేయడం, హాంకాంగ్లో హక్కుల పరిరక్షణ, ఇండో-పసిపిక్ ప్రాంతంలో ఆధిపత్యం కొనసాగించడం, అమెరికా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న చైనా కార్యకలాపాలపై మరింత నిఘా పెట్టడం, భారత్కు రక్షణ సహాయంలో తోడ్పాటు తదితర అంశాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష హోదాలో బైడెన్ కూడా భారత్తో సత్సంబంధాలు కోరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే గతంలో పాకిస్తాన్కు నిధుల నిలిపివేత నిర్ణయాన్ని బైడెన్ వ్యతిరేకించిన సందర్భం ఉంది. ఆయన సెనెటర్గా ఉన్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు అధ్యక్షుడయ్యాక కమిటీల నివేదికలు, నిఘా వ్యవస్థల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటున్న నేపథ్యంలో భారత్తో సత్సంబంధాలే కొనసాగిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.











