ఏపీలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా విశాఖ వెళ్లి శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్వేదిలో రథం దహనం, దుర్గగుడి వెండి రథంపై మూడు వెండి సింహాల ప్రతిమలు మాయంకావడంతోపాటు, అనేక దేవాలయాల్లో అపరాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంతలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన హిందువుల ఆగ్రహానికి దారితీసింది.
దేవునిపై నమ్మకముంటే చాలని అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెంకన్నను దర్శించుకోవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఓ మెట్టు దిగిన టీటీడీ ఛైర్మన్, తామే ముఖ్యమంత్రిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తున్నాం కనుక, స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని, మిగతావారి విషయంలో డిక్లరేషన్ ఉంటుందని మాట మార్చారు.
ఈ వ్యవహారాలన్నీ హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. దీంతో అప్రమత్తమైన వైసీపీ ప్రభుత్వం హిందూ పెద్దల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలసి ఆయన ఆశీస్సులు కోరినట్టు తెలుస్తోంది.
హిందూ సంస్థల ఆగ్రహమే కారణమా?
అంతర్వేది రథం దహనం, దుర్గగుడి వెండి రథంపై మూడు సింహాల ప్రతిమలు మాయం కావడంతో ప్రతిపక్షాలు, హిందూ సంస్థలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే హుటాహుటిన అంతర్వేది కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారాలతో దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి మంత్రి పదవి ఊడుతుందనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల వివరాలన్నీ సేకరించిన ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు ఢిల్లీలోని బీజేపీ పెద్దల వద్ద సీరియస్ గానే చెప్పారట. దీంతో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు కూడా సీరియస్ గానే ఉన్నారని సమాచారం. అందుకే వారిని కొంత మేర చల్లబరిచేందుకే శారదాపీఠాధిపతిని రంగంలోకి దింపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రిని విశాఖ పంపించారని తెలుస్తోంది.
స్వామి ఆశీస్సులతో మంత్రి పదవి కాపాడుకుంటారా?
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు మీడియాలో హచ్ ఛల్ చేస్తున్నాయి. శారదాపీఠాధిపతితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ తన పదవి కాపాడుకునేందుకు స్వామి వారి ఆశీస్సుల కోసం కలసినట్టు తెలుస్తోంది. స్వామి వారి ఆశీస్సులు దక్కితే వెల్లంపల్లి మంత్రి పదవి మరో ఏడాది కొనసాగే అవకాశం ఉంది.
ఏపీలో దేవాలయాలపై కొనసాగుతున్న దాడులు
తాజాగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న ప్రఖ్యాత నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలను దుండగులు ద్వంసం చేశారు.దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం రాష్ట్రంలో ఏదోఒక మూల దేవాలయాలపై దాడులు, అపచారాలు చోటు చేసుకోవడంపై హిందువులు ఆగ్రహంగా ఉన్నారు. వీరి ఆగ్రహాలను చల్లార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
తిరుమల వ్యవహారంపై స్వరూపానంద ప్రకటన వస్తుందా?
తిరుమలలో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయాలా వద్దా అనే వ్యవహారంపై స్వరూపానంద నుంచి ప్రకటన రావచ్చునని కూడా అంచనాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం వివాదంగా మారడంతో జగన్ కు సన్నిహితుడైన స్వరూపానంద ద్వారా ప్రకటన చేయిస్తారని.. దేవుడి దగ్గరకు ఏ మతం వాళ్లయినా నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.. అందుకోసం డిక్లరేషన్ వంటివి అమానుషం అని చెప్పిస్తారని.. అందుకోసం ఆల్రెడీ ఆయన వద్దకు వేడుకోళ్లు వెళ్లాయని.. లియోన్యూస్ డాట్ కామ్ ఇప్పటికే ఒక కథనం ప్రచురించింది.
‘మీరు మాట్లాడండి’ స్వరూపానంద వద్దకు వేడికోళ్లు!
అచ్చంగా లియోన్యూస్ ప్రచురించిన కథనంలో మాదిరిగానే వ్యవహారం జరిగింది. స్వరూపానంద వద్దకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, సింహాచలం ఆలయ ఈవో, అక్కడి ట్రస్టు బోర్డు సభ్యులు ఇద్దరు కలిసి వెళ్లారు. టిటిడి వ్యవహారంలో కూడా జోక్యం చేసుకుని ఒక హిందూ మఠాధిపతిగా ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు. మరి స్వరూపానంద ఎలా స్పందిస్తారో ఏం చెప్తారో చూడాలి.











