జగన్ పార్టీలో విధానాలు నచ్చక దగ్గరి వారు సైతం వైదొలుగుతున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి స్వయంగా బావమరిది, మాజీ ఎమ్మెల్యే అయిన గడికోట ద్వారకానాథ రెడ్డి వైసీపీకి గుడ్ బాయ్ చెప్పేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్లతో సంప్రదింపులు జరిపారు. బుధవారం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో తాను టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. చాలా ఏళ్ల క్రితం గడికోట ద్వారకానాథ్ రెడ్డి లక్కిరెడ్డి పల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచారు. కడప జిల్లాలో పునర్విభజనలో భాగంగా లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దయింది. కొన్ని మండలాలు రాయచోటిలో విలీనం అయ్యాయి. ఈసారి రాయచోటి నుంచి ద్వారకానాథ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు.
1994లో గడికోట ద్వారకానాథ రెడ్డి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ద్వారకానాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ టికెట్ అడిగినా కూడా అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. తర్వాత వైసీపీ పెట్టిన తర్వాత 2014లో ఆ పార్టీ టికెట్ను ఆశించారు. అప్పుడు కూడా కుదరలేదు. 2019లో కూడా అటు వైసీపీ నుంచి, ఇటు తెలుగుదేశం పార్టీల నుంచి టికెట్ ఆశించినా రెండు చోట్ల సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో ద్వారకానాథ్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మారిన పరిస్థితుల వేళ గడికోట ద్వారకానాథ రెడ్డి ప్రస్తుతం రాయచోటి టీడీపీ టికెట్ను ఆశిస్తున్నారు. ద్వారకానాథ రెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
1962 నుంచి ఈయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ వస్తుంది. ఎంపీ విజయసాయిరెడ్డి భార్య ద్వారకానాథరెడ్డికి స్వయానా అక్క అవుతుంది. ద్వారకానాథ రెడ్డితో పాటు ఆయన అన్న గడికోట సురేంద్రనాథ రెడ్డి, అక్క హరెమ్మ (నందమూరి తారకరత్నకు స్వయానా అత్తగారు) కూడా నేడు టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే రాయచోటి ఎమ్మెల్యే టికెట్ను టీడీపీ తరఫున ముగ్గురు నాయకులు ఆశిస్తుండగా ద్వారకానాథ రెడ్డి చేరిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీంతో వారిలో టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
అయితే, బావమరిది ద్వారకానాథ రెడ్డిని విజయసాయి రెడ్డి ఆపేందుకు యత్నించినట్లు సమాచారం. అయితే, ఆయన వైసీపీ నుంచి టికెట్ హామీ అడిగారని.. అది సాధ్యం కాకపోవడంతో విజయసాయి రెడ్డి ఏమీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ద్వారకానాథ రెడ్డి టీడీపీలో చేరితే రాయచోటి వైసీపీ క్యాడర్ లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.