చంద్రబాబునాయుడు ప్రతిష్టను ఆయన రాజకీయ ప్రత్యర్థులు దిగజార్చదలచుకుంటే.. ఏం చేయాలి? ఆయన పాలనలోని లోపాలను గుర్తించాలి. ప్రజలు కూడా బాగా ఆమోదించే, వారందరికీ బాగా తెలిసిన లోపాలను గుర్తించి.. వాటిని మరింత హైలైట్ చేసి.. ప్రచారం సాగించాలి. ఎటూ అవి లోపాలే అని ప్రజల్లో అనుమానం ఉంటేనే.. వారి ప్రచారం మరింత అపకీర్తికి దారితీస్తుంది. అలాకాకుండా.. చంద్రబాబు మీద అద్భుతమైన సానుకూల అభిప్రాయం ఉన్న విషయాల్లో కూడా పనిగట్టుకుని బుదర చల్లే ప్రయత్నం చేస్తే బెడిసి కొడుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి పనిగట్టుకుని చంద్రబాబు నాయుడు మీద ప్రారంభించిన దుష్ప్రచారం ఆయన పరువే తీసేలా కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి మీద రాజధానిగా ఫోకస్ పెట్టినట్టే.. విశాఖపట్నం మీద కూడా ఎంత ఎక్కువ ఫోకస్ పెట్టారో అందరికీ తెలుసు. ప్రపంచస్థాయి సదస్సులన్నింటినీ విశాఖలోనే నిర్వహించారు. ఆ రకంగా అసలే కాస్మోపాలిటన్ నగరంగా పేరున్న విశాఖ ఇమేజికి తగ్గట్లుగా దానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చేశారు. ఏపీలో ఐటీ హబ్ గా విశాఖను తీర్చిదిద్దారు. అనేక ప్రాజెక్టులు అక్కడకు వచ్చాయి. ఈ రకమైన ప్రాధాన్యం అంతా పక్కన పెట్టేసినప్పటికీ.. హుదుద్ తుపాను సందర్భంలో చంద్రబాబు ఎంత అద్భుతంగా పనిచేశారో రాష్ట్రం అందరికీ తెలుసు.
హుదుద్ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతో బాగా స్పందించింది. ఆ సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం మాత్రమే కాదు.. హుదుద్ ఉధృతి ముగిసిన తర్వాత.. విశాఖపట్నాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో కూడా చంద్రబాబు కృషి ఎంతో ఉంది. వాస్తవంగా క్రైసిస్ మేనేజిమెంట్ లో చంద్రబాబు ఎంత గట్టిగా వ్యవహరిస్తారో రాష్ట్రం మొత్తం గమనించింది.
అలాంటి చంద్రబాబునాయుడును ‘‘విశాఖ కంటకుడు’’ గా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు ప్రారంభించారు. ఆయన చంద్రబాబు మీద కక్కదలచుకున్న విషాన్ని- వారి పార్టీ సొంత పత్రిక సాక్షి కూడా వేయడానికి ఇష్టపడలేదో ఏమో గానీ.. ఆయన తన ఫేస్ బుక్ వాల్ మీద పోస్టులు పెట్టడం ప్రారంభించారు. పార్ట్-1 కథనం విడుదల అయింది. దీనిని చూస్తే ‘‘విశాఖ కంటకుడు’’ అనే వ్యాసాలను ఆయన ఒక సిరీస్ గా అందించడానికి పూనుకున్నట్లుగా కనిపిస్తుంది.
మేం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అనే పడికట్టు మాటలను వైఎస్సార్సీపీ చెబుతోంది. అదే సమయంలో.. చంద్రబాబు ఆ పనిచేయలేదనడం మాతరం అసంబద్ధం. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బాబు చేసినవి ఎన్నో ఉన్నాయి. కాకపోతే- అమరావతి రాజధానిగా ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దాలని అనుకొన్నారు గనుక.. అక్కడ కొంత ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో – ఆయన పనితీరులో కొన్ని లోపాలు ఉండవచ్చు. వైరిపక్షం గనుక.. అప్పటి లోపాలను వైఎస్సార్సీపీ నాయకులు ఎత్తిచూపవచ్చు. అంతవరకు ఓకే. కానీ, చంద్రబాబు ఇవాళ విశాఖకు రాజధాని తరలిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు గనుక.. ఆయనను ‘విశాఖ కంటకుడు’గా అభివర్ణించే విషపూరిత వ్యాసాలు సరికాదు.
విశాఖను చంద్రబాబు ఎంతగా ప్రేమించారో హుదుద్ ఒక్క ఉదాహరణ చాలు. రాజధాని విషయానికి వస్తే.. మూడు రాజధానుల కాన్సెప్టుకు వ్యతిరేకం తప్ప.. విశాఖ ఎదుగుదలకు కాదు అని అధికార పార్టీ గుర్తించడం లేదు. చంద్రబాబు మంచి ఎంత- చెడు ఎంత అనేది ప్రజలకు చాలా బాగా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మీద ఈ స్థాయిలో దష్ప్రచారం అనేది విజయసాయిరెడ్డి పరువునే పలుచన చేస్తుంది. విశాఖలో రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ దందాలు నడిపించే వారికి, వైకాపా కార్యకర్తలకు, విజయసాయి అభిమానులకు ఈ రాతలు రుచించవచ్చు. కానీ.. చంద్రబాబు మీద ఇలాంటి దుష్ప్రచారం.. చంద్రబాబు అభిమానుల్ని బాధిస్తుంది. తటస్థులకు ఆయన మీద సానుభూతి పెరిగేలా చేస్తుంది. ఈ రెండింటినీ మించి విజయసాయికే పరువు పోతుంది.
https://www.facebook.com/VijayaSaiReddyOfficial/posts/2678261709055339











