అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించారు.. ఎన్నికల్లో విజయం సాధించి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. స్థానిక ఎన్నికల్లో తమకు కావలసిన వారికి సీట్లు ఇప్పించుకున్నారు. ఒకసారి అధికారం పోగానే పక్క చూపులు చూస్తున్నారు. క్లుప్తంగా విశాఖలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకుల వ్యవహార శైలి ఇది. వీరి ప్రవర్తన కారణంగా గతంలోనే కొందరు తెలుగుదేశం పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. పార్టీ కోసం ప్రాణాలిచ్చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ… అంతిమంగా స్వప్రయోజనాల కన్నా ఇంకేదీ ఎక్కువ కాదని నిరూపిస్తున్నారు.
నాయకుల తీరును నిశితంగా పరిశీలిస్తే…
తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్ల పాటు పదవులు అనుభవించి గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు విషయానికి వద్దాం.. నగరంలో కీలకమైన నాలుగు నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంది. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణం, ఉత్తరం నియోజక వర్గాల నుంచి గెలుపొందిన వీరు స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలమైన అభ్యర్థులకు సీట్లు కేటాయించడం కోసం పార్టీ సీనియర్ నాయకులను సైతం పక్కన పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో తమ పంతం నెగ్గించుకునేందుకు పార్టీ సీనియర్లతో విభేదించారు.
సాధారణంగా స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే ఫైనల్ చేసిన అభ్యర్థులకే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ క్రమంలో అదే నియోజకవర్గంలో ఉన్న సీనియర్లకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ విషయానికి వస్తే.. అదే నియోజకవర్గం లోని సీనియర్ నాయకుడు జహీర్ అహ్మద్ తనయుడికి కార్పొరేట్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అన్ని ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ కొడుకుకి కనీసం స్థానిక ఎన్నికల్లో టికెట్ కూడా తెచ్చుకోలేని దయనీయ స్థితిలో ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరారు.
అంత చేసినా… వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఇప్పుడు వైసిపి పంచన చేరారు. అటు గంటా నియోజకవర్గంలోనూ.. ఇటు గణబాబు నియోజకవర్గంలోనూ సీట్ల కేటాయింపు ఏకపక్షంగానే ముగించేశారు. జయాపజయాలు… పార్టీ విజయం ఇలాంటి అంశాలను పక్కన పెట్టి … నేను… నా వర్గం అన్న వాళ్లకు మాత్రం సంపూర్ణ న్యాయం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పుణ్యమా అని.. ఎన్నికలు నిలిచిపోయాయి కానీ, లేకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ఊహించడం కాస్త కష్టమే. అభ్యర్థులను ఎంపిక చేయడం విషయంలో ఎమ్మెల్యేల బాధ్యత ఎంత ఉందో.. వారిని గెలిపించుకోవడం లో కూడా అంతే బాధ్యత ఉన్నప్పటికీ.. ఆ దిశగా పనిచేసిన నాయకులు అతితక్కువ అని చెప్పాలి.
పార్టీని వీడుతున్న వారి అనుచరుల పరిస్థితి ఏమిటి?
తెలుగుదేశం పార్టీలో హవా చెలాయించి , ఇప్పుడు అధికార పార్టీలో పెత్తనం కోసం నైతిక విలువలు తాకట్టు పెడుతున్న నాయకులు.. వారిని నమ్ముకున్న అనుచరులకు ఏ విధమైన మార్గదర్శకం చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జెండాలు పట్టుకుని పాలేరుల్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయకుల సేవలో చెమటోడ్చిన వారికి కూడా సమాచారం ఇవ్వకుండా సంప్రదించకుండా గోడదూకేస్తున్నారు.
అభ్యర్థుల పరిస్థితి ఏంటి?
స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారి భవితవ్యం ఏంటన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. వారు కూడా నాయకుల వెంటే నడిస్తే తరువాత జరగబోయే స్థానిక ఎన్నికల్లో టికెట్ కోల్పోవలసి వస్తుంది. అలాగని తెలుగు దేశం పార్టీని నమ్ముకుని ఉన్నా సరే తర్వాత వచ్చే నాయకత్వం ఎంతవరకు టికెట్ ఖరారు చేస్తారన్నది ప్రశ్నార్థకం . ఎన్నికల నియమావళి ప్రకారం గతంలో దాఖలు చేసిన నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా రద్దయి.. మళ్లీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో మిగతావారి సంగతి ఎలా ఉన్నా కార్పొరేటర్లు గా పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.
ఉన్న పార్టీకి ఎసరు పెట్టి…
ఉన్న పార్టీకి ఎసరు పెట్టి… పక్క పార్టీలోకి దూకుతున్న నాయకులు ఆ పార్టీకి మాత్రం ఏ మేరకు న్యాయం చేస్తారన్నది ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలు అంటే ప్రజాసేవ… పార్టీ విధేయత.. పార్టీ అభ్యున్నతి.. లాంటి నిర్వచనాలు అన్నీ పోయి… నాకేంటి ? అన్న స్వార్థం నిలువెల్లా ఆవహించేసింది.











