(ఉత్తరాంధ్ర లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో సందర్శకుల ప్రవేశాలను మంగళవారం నుంచే అధికారులు నిలిపి వేశారు. హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలలో సింహాలకు కరోనా సోకిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అరసవెళ్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయం, విశాఖపట్నం కనుక మహాలక్ష్మీ ఆలయం, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, నెల్లిమర్ల శ్రీ కోదండరామ స్వామి ఆలయాల్లో బుధవారం నుండి ఉదయం11.30 గంటల వరకే దైవదర్శనానికి అవకాశం కల్పించనున్నారు.
గ్రేటర్ విశాఖ పరిధిలో 13 రైతు బజార్లతో పాటు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి పాక్షికంగా లాక్డౌన్ విధించనున్నారు. లాక్డౌన్కు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల షాపులకు అనుమతించారు. ప్రజా రవాణాకు సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతించారు. 12 గంటల తరువాత అత్యవసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. కిరాణా దుకాణాలు, రవాణాపై ఆంక్షలు పెట్టారు. రెండు వారాల పాటు 144 సెక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతించారు. ఈ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా బుధవారం నుంచి గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న 13 రైతు బజార్లతో పాటు.. అనదనంగా మరో 33 మినీ రైతుబజార్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోను ఇటువంటి చర్యలు చేపట్టారు.
పర్యాటక కేంద్రాలన్నిమూసివేత
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సింహాచలం అప్పన్న, కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సయమంలో విశాఖ ఏజెన్సీ పరిధిలోని పర్యాటక కేంద్రాలన్నింటిని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్ ఇవాళ్టి నుంచి మూతపడనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోను పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టారు.











