వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోలుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఉక్కుశాఖ తాజాగా విడుదల చేసిన 2024-25 వార్షిక నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గత అక్టోబరు నుంచి రెండో బ్లాస్ట్ఫర్నేస్ ప్రారంభించిన అనంతరం సంస్థ ఉత్పత్తి సామర్థ్యం సగటున రోజుకు 13,485కి పెరిగింది. ప్రస్తుతం రెండు ఫర్నేస్లు 98% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హై ఎండ్ విలువ గల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని, దానికి సంబంధించి దేశీయ మార్కెట్లో తన వాటాను పెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించకముందు చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం కారణంగా పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయలేదు. దీంతో సంస్థ అమ్మకాల టర్నోవర్ 2024-25 డిసెంబరు నాటికి రూ.12 వేల కోట్లకే పరిమితమైంది. ఫలితంగా నష్టాలు రూ.3,943 కోట్లకు చేరాయి. ఈ ఏడాదిలో సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1,198 మేర తగ్గింది.
రెండో బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం –
కంపెనీ అధీకృత వాటాలు 2024 మార్చి 31 నాటికి రూ.8 వేల కోట్ల మేర ఉండగా, 2024 డిసెంబరు 31 నాటికి అది రూ.15 వేల కోట్లకు చేరింది. నిధుల కొరత, ఆర్థిక సంక్షోభం కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేదు. దీంతో అమ్మకాలు 2024 డిసెంబరు 31 నాటికి రూ.12,429 కోట్లకు పడిపోయాయి. రూ.3,943.43 కోట్ల మేర నికరనష్టం వాటిల్లింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో సంస్థ 2024 అక్టోబరు 28 నుంచి రెండో బ్లాస్ట్ఫర్నేస్ను పునఃప్రారంభించి రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి సాధించింది. రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు 98% ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకున్నాయి. అనుకున్న సమయానికి ముందే 2వ బ్లాస్ట్ఫర్నేస్ను ప్రారంభించడంతోపాటు డిసెంబరులో ఇదివరకున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని మించింది. రెండు ఫర్నేస్ల ద్వారా రోజుకు 13 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం సాధించాలన్నది లక్ష్యంకాగా దానికంటే 3.7% అదనంగా సాధించింది.బొగ్గులో హార్డ్ కోకింగ్ కోల్ను కలపడాన్ని 57.5% నుంచి 53.4%కి తగ్గించుకుంది.
మార్కెట్ను విస్తృతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇతర ఉత్పత్తి సంస్థల మాదిరిగానే టీఎంటీ, స్ట్రక్చరల్ ఉత్పత్తుల విక్రయాల కోసం డిస్ట్రిబ్యూటర్/డీలర్ విధానాన్ని తీసుకొచ్చింది.దేశవ్యాప్తంగా ఏ మారుమూల ప్రాంతాలకైనా తన ఉత్పత్తులను పంపేందుకు వీలుగా ఈ-సువిధ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల ఇంటి వద్దకే తన సేవలు అందించేందుకు సిద్ధమైంది. సంస్థలో ఉద్యోగుల సంఖ్య 2024 మార్చి 31 నాటికి 13,536 ఉండగా, డిసెంబరు 31నాటికి 12,338కి తగ్గింది.2023-24లో విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.5,218.46 కోట్ల నష్టం వాటిల్లింది. గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం.
విశాఖ స్టీల్ ప్లాంట్ హై ఎండ్ విలువ ఉన్న ఉక్కు ఉత్పత్తిని 12.96 లక్షల టన్నుల నుంచి 13.28 లక్షల టన్నులకు పెంచింది. విక్రయించడానికి అనువైన 23.73 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధించింది. గోదాముల్లో పడి ఉన్న 30 వేల టన్నుల ఉక్కును విక్రయించింది. దేశీయ ఉక్కు విక్రయాల్లో 2023-24లో ఉన్న 57% వాటాను 63%కి పెంచుకుంది. హై ఎండ్ విలువగల స్టీల్ విక్రయాల్లో తన వాటాను 31% నుంచి 35%కి చేర్చింది. మొత్తం విక్రయాల్లో నేరుగా పంపిణీ చేసే పరిమాణం 2023-24లో 30% ఉండగా, 2024-25 నాటికి అది 42%కి పెరిగింది. 95,200 మెట్రిక్ టన్నుల ఇనుము, ఉక్కు తుక్కు విక్రయం ద్వారా రూ.336 కోట్ల అదనపు రాబడి సాధించింది.