ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ వ్యవహరం ఒక రాజ్యాంగ వ్యవస్థకు, ప్రభుత్వంలో అత్యున్నత అధికారి రూపేణా మరో వ్యవస్థకు మధ్య నిప్పు రాజేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ మధ్య ముఖాముఖి యుద్ధం ముదురుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి లేఖ పంపారు. అయితే ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని, ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఎస్ సమాధానం పంపారు. దీంతో ఎన్నికల కమిషనర్ మరో లేఖ సంధించారు. రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించే అధికారం మీకు లేదంటూ సీఎస్ కు ఘాటు సమాధానం ఇచ్చారు. దీంతో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ప్రచ్చన్న యుద్దం ప్రారంభమైంది.
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పై సస్పెన్స్…
బుధవారం సాయంత్రం జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రద్దు చేసుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు గురువారం ఉదయం పది గంటలకు అన్నీ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సుకు సిద్దంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే దీనిపై ఇంత వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సమాధానం రాలేదు. ఇవాళ పది గంటలకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు జరుగుతుందా? కాన్ఫరెన్సుకు ప్రభుత్వం సహకరిస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.
ఒకవేళ వీడియో కాన్ఫరెన్సుకు కలెక్టర్లు హాజరు కాకపోతే ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ సమావేశాలకు హాజరుకాకపోతే కలెక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అలాంటి అధికారాలు ఎన్నికల కమిషనర్ కు ఉంటాయా? అనే అనుమానాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి.
అయితే సీఎస్ ఆదేశాల కోసం కలెక్టర్లు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. సీఎస్ నుంచి వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కావాలని సమాచారం అందితే కలెక్టర్లు హాజరయ్యేందుకు సిద్దపడుతున్నారని సమాచారం. అయితే సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- ఎన్నికల కమిషనర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!
నిమ్మగడ్డ మళ్లీ కోర్టుకు వెళ్తారా?
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. గవర్నరు వద్దకు వెళ్లడం ఫిర్యాదు చేయడం అయిపోయింది. అయినా ఆయన మాటను ప్రభుత్వం ఖాతరు చేస్తున్న వాతావరణం ఏర్పడలేదు. ఎన్నికలకు అనుకూల వాతావరణం ఎప్పుడు ఉంటుందో.. అప్పుడు మేమే తెలియజేస్తాం అని సీఎస్ తెగేసి చెప్పేశారు. ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ మళ్లీ కోర్టుకు వెళతారా? అనేది కీలకాంశంగా మారుతోంది. ఇదివరకటి కేసులకు ఈ కేసు భిన్నమైనది.. అలాగే ప్రభుత్వం చెప్తున్న కారణాలు కోర్టు ఏకపక్షంగా తోసిపుచ్చదగినవి కూడా కాదు. అలాంటి నేపథ్యంలో.. కోర్టు ద్వారా ఎన్నికలు నిర్వహించగలగడం అనేది భ్రమ. ఒకవేళ నిమ్మగడ్డ అలాంటి పిటిషన్ వేస్తే.. కోర్టులో అది ఎప్పటికి తేలుతుందో కూడా అనుమానమే.
తాజా నోటిఫికేషన్ ఇస్తాం.. :నిమ్మగడ్డ
గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నిర్ణయించారని తెలుస్తోంది. ప్రభుత్వం సహకరించకపోతే నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే దానిపై రాజ్యాంగ కోవిదులు అనేక విశ్లేషణలు తెరమేదకు తెస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తే కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ వస్తే ఇక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం చేతిలోకి వచ్చినట్టేనని చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య ముఖాముఖి యుద్ధం ఎటుదారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.
Also Read ;- ఫిబ్రవరి ఎన్నికలకు జగన్ దళానికి భయమెందుకు?