ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించే విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నిర్వహించనున్న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం పై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి హై కోర్టుకు వెళ్లింది. రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించకుండా స్టే ఇవ్వాలని కోరింది.
కరోనా కారణం గా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ గత మార్చి మూడో వారంలో అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆగమేఘాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పిస్తూ, ఆ స్థానంలో జస్టిస్ కనగరాజు నియమించింది.
దీనిపై రమేష్ కుమార్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. ఎన్నికల సంఘం నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదని, కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ఎన్నికల సంఘం భావించింది. ఇందుకోసం బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చింది. కరోనా ముప్పు ఇంకా ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఇప్పటికే కొందరు మంత్రులు ప్రకటించారు.
ఈ సమావేశానికి హాజరు కాకూడదని వైకాపా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్న సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా నిర్ణయిస్తుందని వైకాపా అధికారికంగా విమర్శించిన నేపథ్యంలో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాన్ని నిర్వహిస్తున్నందున, సదరు సమావేశం జరగకుండా స్టే ఇవ్వాలని కోరింది.