వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ నిరసన ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ నేతలు అందరికీ జగన్ గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఈ ధర్నా ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అయినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచే కొందరు ఎమ్ఎల్ఏలు ఆ ధర్నాకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వంపై ఢిల్లీలో ధర్నా చేపడతామని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రకటించుకోగా.. కనీసం సొంత పార్టీ నేతలనే వైసీపీ అధినేత ధర్నాకు రప్పించుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు బుధవారం నాడు శాసన మండలి సమావేశాలకు హాజరు అయ్యారు. దీంతో జగన్ ఆదేశాలను వారు ధిక్కరించినట్లు అయింది. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ఉద్దేశంతో బుధవారం ఢిల్లీలో వైసీపీ అధినేత ధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జగన్ ఢిల్లీ వెళ్ళారు. కానీ, ఇద్దరు మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా మండలిలో కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోరని జగన్ మోహన్ రెడ్డి ముందే ప్రకటించారు.
కానీ, ఎమ్మెల్సీలు మాధవరావు, రవీంద్రలు మాత్రం ఢిల్లీ ధర్నాకి డుమ్మా కొట్టేశారు. అధినేత ఆదేశాలను కాదని కౌన్సిల్ కు హాజరు కావడంతో కూటమి సభ్యులు ఆశ్చర్యపోయారు. అదేంటి.. మీ అధినేత ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు కదా.. మీరు ఢిల్లీ వెళ్లలేదా.. అంటూ పలువురు కూటమి సభ్యులు వారిని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీలంతా ఢిల్లీ వెళ్తే.. ఈ ఇద్దరు మాత్రమే మండలికి హాజరు కావడంతో వీరు త్వరలోనే వైసీపీని వీడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరు ఇద్దరు లోకేశ్ తో మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ప్రభుత్వం విఫలం అయిందని గగ్గోలు పెడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపడుతోన్న ఈ ధర్నాను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ధర్నాను విజయవంతం చేయాలని పట్టుదలతో ఉంది. అందుకే పార్టీ ప్రతినిధులను అంతా ఢిల్లీకి రావాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశించింది. ఒకవేళ ఢిల్లీలో ఆ కార్యక్రమం సక్సెస్ కాకపోతే.. జాతీయంగా పరువు పోతుందనే ఉద్దేశంతో వైసీపీ ఆ ధర్నాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా.. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఢిల్లీ రావాలని ఆదేశించింది. అయితే, తాజాగా ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం మంగళవారం మండలికి హాజరు కావడం చర్చనీయాంశం అయింది.