సుదీర్ఘ కాలం తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీని టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీకి మద్దతు తెలిపేలా వైసీపీ ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ లో భాగంగానే వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ లు వైసీపీకి మద్దతు తెలిపారు. వారి చర్యలను ఖండిస్తూ పలు వేదికలపై టీడీపీ విమర్శలు చేసింది. కానీ వారిపై చర్యలు తీసుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలోనే టీడీపీకి ఆర్థికంగా చేయూత ఇస్తున్న వారిని టార్గెట్ చేసిందని తెలుస్తోంది.
ఆర్థిక మూలాల మీద వైసీపీ గట్టి దెబ్బ
ఎన్నికల కంటే ముందే ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాస రెడ్డిలను చివరి నిమిషంలో వైసీపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. వారికి వెంటనే నెల్లూరు, ఒంగోలు స్థానాలను కేటాయించింది. దీంతో టీడీపీకి ఆయా స్థానాల అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారంగా నిలిచింది. కానీ చంద్రబాబు మరోమారు తన విజ్ఞతతో నెల్లూరు నియోజకవర్గానికి బీద మస్తాన రావు, ఒంగోలు నుంచి శిద్దా రాఘవరావులను ఎంపిక చేశారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి బలంగా వీచడంతో బీద, శిద్దాలు ఓడిపోయారు. ఆర్థిక, సామాజిక సమీకరణాల దృష్ట్యా వీరిద్దరిని వైసీపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. అందుకు సమ్మతించిన వారు కూడా వైసీపీలో చేరారు. తమ బిజినెస్ లకు ఇబ్బంది ఎందుకనే ఉద్దేశంతో వారు వైసీపీ కండువా కప్పుకున్నట్లు వార్తలు ప్రచారం జరిగాయి.
గతమెంతో ఘనం
‘నారాయణ’ సంస్థల అధినేత నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు, రాయపాటి, జీవి ఆంజనేయులు, దాసరి రమేష్, చందనా రమేష్, పోతుల రామారావుల పరిస్థితి చూస్తే మనకు అర్ధమవుతోంది. వైసీపీ ఎత్తుగడలను ముందే ఊహించి కొందరు బీజేపీలో చేరగా మరి కొందరు వైసీపీలో చేరారు. టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్న వారిపై వైసీపీ ప్రతీకార చర్యలకు దిగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల పరంగా చూస్తే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన క్వారిలపై కేసులు, జరిమానాలు విధించడం జరిగిపోయాయి. కానీ రవి మాత్రం పార్టీ మార్పు నిర్ణయాన్ని తీసుకోకుండా టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, గంటా శ్రీనివాసరావుల బిజినెస్ లపై అధికార పార్టీ టార్గెట్ పెట్టినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
టార్గెట్ @డీకే…
తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఫ్యామిలీపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో ఆదికేశవుల నాయుడు కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పని చేశారు. వైఎస్ఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న డీకే అనూహ్యంగా 2004లో టీడీపీలో చేరారు. టీడీపీ తరుపున హ్యాట్రిక్ విజయం సాధించిన రామకృష్ణా రెడ్డి పోటీకి దూరం జరగడంతో చంద్రబాబు ఓ బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. ఆ నేపథ్యంలోనే డీకే..చంద్రబాబుని ఒప్పించి చిత్తూరు ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా చిత్తూరు ఎంపీగా డీకే గెలిచారు.
2008లో ‘అణు ఒప్పందం’ విషయంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్రంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంగా డీకే యూ-టర్న్ తీసుకొని విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. డీకే చేసిన ‘మేళ్ల’కు గుర్తింపుగా ఆయనకు టీటీడీ చైర్మన్ గిరి దక్కింది. ఆ తరువాత డీకే కాంగ్రెస్ లోనే కొనసాగినా ఆయన తనయుడు శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రతాప్ చేతిలో శ్రీనివాస్ ఓటమి పాలైయ్యారు. 2013లో అనారోగ్య కారణంతో డీకే మరణించారు. డీలిమిటేషన్ లో చిత్తూరు ఎంపీ ఎస్సి రిజర్వ్ కావడంతో చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదికేశవుల నాయుడు సతీమణి డీకే సత్యప్రభను ఎంపిక చేశారు. సత్యప్రభ ఆ ఎన్నికలలో చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిత్తూరులో కాకుండా ఆమె 2019 ఎన్నికలలో రాజంపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.
అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న ఆ ఫ్యామిలీ తాజాగా జగన్ మోహన్ రెడ్డితో కలవడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లా టీడీపీపై గట్టి దెబ్బ కొట్టాలని ఎదురుచూస్తున్న వైసీపీ తాజాగా డీకే ఫ్యామిలీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డీకే తనయుడు శ్రీనివాస్ ను తమ పార్టీలోకి తీసుకోవాలని వైసీపీ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవలే తిరుమలకు వచ్చిన జగన్ ను కలిసి శ్రీనివాస్ అంగీకారాన్ని తెలిపినట్లు వార్తలు వినబడుతున్నాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసి శ్రీనివాస్ రావడం విశేషం. డీకే శ్రీనివాస్ కు పార్టీలో కీలకమైన పదవిని అప్పగించనున్నారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు చక్రం తప్పిన చాలా మంది నేతలు ఇప్పటికే చాలా మంది సైలెంట్ అయ్యారు. టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి రాష్ట్రంలో కోలుకోకుండా చేయాలని వైసీపీ ‘పెద్దల’ ఆలోచనగా ఉందని సమాచారం. ‘రాజకీయ మేధావి’ చంద్రబాబు వైసీపీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ కు ఎలా కౌంటర్ వేస్తారో చూడాలి!











