ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆకస్మిక నిర్ణయాలు కొత్తేమీ కాదు. టెస్ట్ గా ఆయన ఢిల్లీ పర్యటనకు బయల్దేరే ముందు తీసుకున్న నిర్ణయం కూడా ఆసక్తి రేపుతోంది. ఎప్పుడూ ఒంటరిగా ఢిల్లీ వెళ్లే జగన్ ఈ సారి ఆయన భార్య వై.ఎస్ .భారతిని వెంటబెట్టుకుని ఢిల్లీ బయల్దేరటం మొదటిదైతే.. ఆమెను హైదరాబాద్ లో దించేసి ఆయన ఒక్కడే ఢిల్లీ వెళ్లడం రెండోది. అధికారిక పర్యటనకు వెళ్లేప్పుడు కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వెళ్లడం అరుదు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ, జగన్ వరసగా ఇలానే చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది..
గతంలోనూ ఇలాగే జగన్ అధికారిక పర్యటన కోసం కడప వెళ్లినప్పుడు భారతిని వెంటబెట్టుకుని వెళ్లిన జగన్ ఆమెను హైదరాబాద్లో దించి వెళ్లారట. తర్వాత కపడ టూర్ ముగిశాక హైదరాబాద్ వచ్చి ఆమెను తీసుకుని విజయవాడకు వెళ్లారు. జగన్ వ్యాపార వ్యవహారాలన్నీ ఇప్పుడు భారతి చేతుల్లో ఉన్నాయి. అయితే ఆర్థిక వ్యవహారాల సంగతెలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో భారతి పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఆమె సొంత జిల్లా కడప నుంచి పోటీ చేయబోతున్నారన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీని కోసం ఆమె ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం.
1989 నుంచి వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్లే కడప పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుస్తున్నారు. అయితే ఈ సారి అవినాశ్రెడ్డి బదులుగా భారతిని కడప నుంచి పోటీచేయించాలని జగన్ ఆలోచన. బాబాయ్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డితో పాటు ఆయన కుటుంబం పీకల్లోతు కష్టాల్లో ఉంది. దీంతో జగన్ ఉన్న దారులు వెతుక్కుంటున్నాడట. సోదరి షర్మిలతో విభేదాలు ఓ వైపు, తల్లి విజయమ్మ ఆసక్తి చూపకపోవటం కారణంగా భారతిని కడప నుంచి రంగంలోకి దించాలని జగన్ ఆలోచన.
ఈ నేపథ్యంలోనే జగన్ తన రాజకీయ అనుభవాలను భారతికి చెప్పేందుకు వీలున్నప్పుడల్లా ఆమెను వెంటబెట్టుకు వెళుతున్నారట. ఇదే నిజమైతే ఆమెను ఢిల్లీ దాకా ఎందుకు దీసుకెళ్లలేదు? హైదరాబాద్ లో ప్రత్యేక విమానం ఆపి ఆమెను హైదరాబాద్ లో ఎందుకు దించి ఆయన ఢిల్లీ వెళ్లినట్టు? అన్నది మాత్రం అంతు చిక్కటం లేదు. అయితే తాడేపల్లి ప్యాలెస్లో కంటే ముఖ్యమైన అంశాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు హైదరాబాద్ దాకా భారతిని తీసుకొచ్చి జగన్ వెళ్లిపోయారని మరికొంత మంది విశ్లేషణ.











