ఏపీలో గనుల శాఖ మాజీ ఎండీ వీజీ వెంకట రెడ్డిని ఎట్టకేలకు ఏపీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గనుల శాఖలో ఎన్నో అక్రమాలకు పాల్పడి.. గత కొంత కాలంగా వీజీ వెంకట్ రెడ్డి తప్పించుకుతిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అరెస్టు చేయడంతో శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఇప్పటికే వెంకట రెడ్డిపై ఏసీబీ అధికారులు అనేక కేసులు నమోదు చేశారు. వెంకట రెడ్డి చర్యల వల్ల ప్రభుత్వానికి రూ.2,566 కోట్ల దాకా ఆదాయానికి గండి పండిందని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, వెంకట రెడ్డి లొంగి పోయారని వైసీపీ నేతలు చెబుతుండగా.. తామే అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు ధ్రువీకరించారు.
వెంకట రెడ్డిని శుక్రవారం ఉదయమే విజయవాడకు తరలించారు. మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ కోసం కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కడప జిల్లాకు చెందిన వెంకటరెడ్డి కేంద్ర సర్వీసులకు చెందిన స్టాఫ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగి. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో 2019లో వెంకట్ రెడ్డిని ఇక్కడకు డిప్యుటేషన్ పై రప్పించారు. ఇసుక, మైనింగ్ జగన్ అనుయాయులకు దోచిపెట్టడంలో బాగా సహకరించారు. ఇసుక టెండర్లు పాడుకున్న జేపీ వెంచర్స్తో కలిసి కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.800 కోట్ల దాకా నష్టం చేకూర్చారు. బయటికి కనిపించకుండా వేలకోట్ల రూపాయల దోపిడీకి సహకరించారు.
అలా కొట్టేసిన సొమ్మంతా సింహ భాగం తాడేపల్లి ప్యాలెస్కు చేర్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి ఎన్డీఏ సర్కారు ఏర్పడటంతో అక్రమాలను వెలుగులోకి తెచ్చే ప్రక్రియ మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రైమరీ రిపోర్టును తెప్పించుకుని ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆగస్టు 31న కేసు నమోదు చేసిన ఏసీబీ అప్పటి నుంచి ఆయన కోసం వెతుకుతోంది. అలా కడప, తిరుపతి, విజయవాడతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వెతికారు.
కానీ, వెంకట్ రెడ్డి ప్రభుత్వం మారగానే ముందుజాగ్రత్తతో విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో వెంకట రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఏసీబీ ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుపడింది. దిక్కుతోచని వెంకట రెడ్డి మధ్యవర్తుల ద్వారా ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. మర్యాదగా లొంగిపోయి విచారణకు సహకరిస్తే తాము కఠినంగా వ్యవహరించబోమని చెప్పినట్లు సమాచారం. లేదంటే తీవ్రమైన చర్యలుంటాయని వారు హెచ్చరించినట్లు తెలిసింది. అందుకే వెంకట్ రెడ్డి లొంగిపోయినట్లు చెబుతున్నారు.











