వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఏపీలో జరిగిన విధ్వంసం ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలన సాగించారు. కూటమి అధికారంలోకి రావడంతో ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఐతే ఇది చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఐతే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రభుత్వం జగన్కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఐనప్పటికీ..జగన్ సభకు హాజరుకాకుండా బెంగళూరు యలహంక ప్యాలెస్కు వెళ్లిపోయారు. తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు మోదీ అందించిన సహకారానికి కృతజ్ఞతగానైనా..ఈ సభకు జగన్ హాజరు కావాలని కోరింది.
ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తున్న మోదీని మర్యాదపూర్వకంగానైనా కలిసి స్వాగతం పలకాల్సి ఉండగా..జగన్ ముఖం చాటేసి ఒక రోజు ముందే బెంగళూరు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం జగన్ ప్రతి శుక్రవారం యలహంక ప్యాలెస్కు వెళ్లిపోతున్నారు.
సోమవారం రాత్రి గానీ, లేదంటే మంగళవారం గానీ వస్తున్నారు. అయితే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని వస్తుండడం.. రాష్ట్ర ప్రజలంతా భారీ సంఖ్యలో సభకు హాజరు కానుండడం.. వారికి ముఖం చూపించలేక పర్యటనను బహిష్కరించి..ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్లిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.