తెలుగు సినిమా నేల విడిచి సాము చేస్తోందా? 300 కోట్లు… 500 కోట్లు బడ్జెట్ తో సినిమాలు తీయాల్సిన అవసరముందా? ఈ కరోనా నుంచి గుణాపాఠం నేర్వలేమా? భారీ పారితోషికాలు, విదేశీ షూటింగులు, భారీ సెట్స్… ఇవన్నీ అవసరమా?… ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలసిని సమయం ఆసన్నమైంది. హీరోలు పరిస్థితులను బట్టి తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాల్సిన అవసరముందని ఈ మధ్య హీరో నాని ఓ మాట అన్నారు. మిగిలిన స్టార్ హీరోల నుంచి అలాంటి మాటలు ఎందుకు రావడం లేదో మరి. ఈ పాన్ ఇండియా అనే మాట ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది.
వందల కోట్ల సినిమా అనే మాట వినగానే ఒకప్పుడు హాలీవుడ్ సినిమానే గుర్తొచ్చేది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరాన్, పీటర్ జాక్సన్, జార్జ్ లూకాస్ లాంటి దర్శకుల చిత్రాలే ఈ కోవలోకి వచ్చేవి. వాటితో పోలిస్తే మన తెలుగు సినిమా పిపీలకమేనని అనాలి. బాహుబలి పుణ్యమా అని ప్రస్తుతం తెలుగు సినిమా ఇప్పుడు భాషా సరిహద్దుల్ని చెరిపివేసింది. పాన్ ఇండియా అనే కొత్త పదాన్ని మనకు వదిలి వెళ్లింది. ఆమాట కొస్తే మన మాయాబజార్, పాతాళ భైరవి, లవకుశ… ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావా?
బాహుబలి తర్వాతే ఇలా…
తెలుగు సినిమా చరిత్రను రాయాల్సి వస్తే ‘బాహుబలి’కి ముందు, తర్వాత అని రాయాల్సి వస్తుందేమో. సినిమా జయాపజయాల్సి పక్కన పెడితే అసలు ఇన్ని కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాంతీయ సినిమాని తెరకెక్కించడానికి ఎన్ని గుండెలు కావాలి? సినిమా అటో ఇటో అయితే పరిస్థితి ఏమిటి? ఏ నమ్మకంతో ‘బాహుబలి’ని తెరకెక్కించారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మన మదిలో మెదులుతాయి. 1932లో మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం గడిచిన 85 ఏళ్లలో దిగంతాలకు సాగిపోయింది. ప్రభాస్ హీరోగా ‘బాహుబలి’ సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి 2011లో ప్రకటించారు.
2013లో షూటింగు ప్రారంభించి 2015లో సినిమా విడుదల చేశారు. ఇంత సుదీర్ఘకాలం షూటింగు జరిగిన తెలుగు సినిమా ఇదేననాలి. రూ.180 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.650 కోట్లు వసూలు చేసింది. రూ. 100 కోట్ల క్లబ్ చేరిన తెలుగు సినిమా లేని తరుణంలో ఈ రికార్డును సాధించడం మామూలు విషయం కాదు. భారీ బడ్జెట్ తో సుదీర్ఘకాలం షూటింగు చేయడం, అందరిమెప్పూ పొందడం తెలుగు సినిమా రంగంలో ఒక్క రాజమౌళికే చెల్లింది. ముఖ్యంగా రాజమౌళి నమ్మకానికి హ్యాట్సాఫ్ చెప్పాల్పిందే.
‘బాహుబలి’కి కొనసాగింపుగా ‘బాహుబలి కంక్లూజన్ ’ను తెరకెక్కించడం మరో విశేషం. రూ.250 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.2000 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఒక ప్రాంతీయ చిత్రం లెక్కలు ఈ తరహాలో ఉన్నాయంటే అది ఒన్ అండ్ ఓన్లీ రాజమౌళి వల్లే సాధ్యమైంది. తెలుగు సినిమా తలరాత మారిందనడానికి ఒక్క ‘బాహుబలి’ చాలు. అయితే అందరూ బాహుబలిని ఆదర్శంగా తీసుకుంటే అందులో బలి అనే ఓ మాట ఉందనే విషయాన్ని కూడా మరచిపోకూడదు. అలాంటి పరిస్థితి మన నిర్మాతలకు రాకూడదనే కోరుకుందాం.
‘బాహుబలి’ ఫలితాన్ని చూశాక పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా పరిస్థితి తయారైంది. ఆ ప్రభావం వేరే దర్శకుల మీద కాదు ఏకంగా రాజమౌళి మీద కూడా పడింది. ఒక సినిమా షూటింగ్ ను ఏళ్ల తరబడి చేయడం మంచిది కాదని నేడు కరోనా నిరూపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఇప్పుడు ఇంటికే పరిమిత మయ్యారు. ఈ పరిస్థితులు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియదు. ఆలోపు మన హీరోల రూపురేఖలు మారిపోతే ఫిట్ నెస్ మాస్టర్లు మాత్రం ఏంచేయగలరు. మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమానే తీసుకుంటే అందులో రకరకాల చిరంజీవులు కనిపిస్తారు. ఇది ఇలాంటి దర్శకులకు ఓ హెచ్చరిక. క్రిష్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు చకచకా సినిమాలు చేసేస్తుంటారు. ఒకవిధంగా ఇలా సినిమాలు చేయడం సేఫ్ జోన్ అనే అనుకోవాలి.
ఏది ఉత్తమ మార్గం?
అది ఏ డమ్ అయినా సినిమాలో దమ్ముండాలి. రాజమౌళి, ఓమ్ రౌత్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో సినిమాలు చేయాలని హీరోలు కూడా ఉబలాటపడుతున్నారంటే దర్శకుడి దమ్ము పనిచేస్తోందని అనుకోవాలి కదా. సినిమా అనేది ఎవరి దమ్ము అయినా బడ్జెట్ తగ్గించుకోవడం, తక్కువ రోజుల్లో పూర్తి చేసుకోవడం ఉత్తమమైన మార్గాలు. ఒకప్పుడు హీరో కృష్ణ ఇలాంటి పాన్ ఇండియా తరహా సినిమాలు ఎన్నో చేశారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. అయినా తక్కువ రోజుల్లోనే షూటింగులు చేసేవారు. అప్పుడెలా సాధ్యమైంది? ఎప్పుడెందుకు సాధ్యం కావడం లేదు? లోపం ఎక్కడుందో దర్శకులు కూడా ఓసారి ఆలోచించుకోవాలి.
పరిస్థితులనుబట్టి దర్శకులు ప్రణాళికలు మార్చుకుంటూ వెళ్లడం మినహా మరో దారి లేదు. ‘బాహుబలి’ లాంటి చిత్రం వచ్చాక రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఉబలాటపడే స్టార్లు చాలా మందే ఉన్నారు. దర్శకుడిలో దమ్ముకు స్టార్ డమ్ బ్రహ్మరథం పడుతుందని వేరే చెప్పనక్కర లేదు. అందుకే తాజాగా ఆయన దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ తెరకెక్కుతోంది. కరోనా రాకపోతే రాజమౌళి కింగే. ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టు డిలే అవుతోంది. ఈ నష్టం ఎవరు భరించాలి. అందుకే పాన్ ఇండియా సినిమా కన్నా ప్లాన్ ఇండియా సినిమా వస్తే మంచిది. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్లింది కదా అని ఇలాంటి ప్రయోగాలే చేస్తూ పోతే చేతులు కాలడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని చేదు అనుభవాలను చూశాక అయినా దర్శకులు గుణపాఠం నేర్చుకుంటే మంచిది. కొన్నాళ్లపాటు బడ్జెట్ తగ్గంచుకునేలా సినిమా చేయడం మంచిదేమో అందరూ ఓసారి ఆలోచించాల్సిందే.
– హేమసుందర్ పామర్తి