(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
వి.వి లక్ష్మీనారాయణ.. ఈ పేరు కన్నా.. జేడీ లక్ష్మీనారాయణ అంటే బాగా అందరికీ బాగా తెలుస్తుంది. సీబీఐ జేడీగా హోదాను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఈ ఐపీఎస్ అధికారి విశాఖ పార్లమెంటు స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఓటమి తర్వాత కూడా కొద్ది రోజుల పాటు- ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం అంటూ పలు ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారని, ఓటమిపాలైనా ప్రజలకు సేవ చేస్తున్నారు అని అంతా భావించారు. కానీ అది మూడు రోజుల ముచ్చట గానే మిగిలింది.
అయితే చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ మంగళవారం విశాఖలో దర్శనం ఇచ్చారు. దేశ వ్యాప్త బంద్లో భాగంగా మద్దిలపాలెం జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రాస్తారోకో చేపట్టారు. ఆ సమయంలో కారులో ఉన్న ఆయన్ను గుర్తించి ఆహ్వానించడంతో ఆయన కాసేపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడారు. అనంతరం ఆయన వెనుదిరిగారు. అయితే ఈ దృశ్యాన్ని చూసిన కొందరు జేడీ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరిపోయారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత విషయం తెలుసుకున్నారు.
ఆదరించిన విశాఖ వాసులు…
లక్ష్మీనారాయణకు విశాఖ జిల్లాతో సంబంధం లేకపోయినప్పటికీ విశాఖ ఓటర్లు బాగానే ఆదరించారని చెప్పాలి. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఆయన వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల విచారణలో చూపించిన దూకుడు, తెగువతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మహారాష్ట్రకు బదిలీ కావడం, సర్వీస్ పూర్తికాకుండానే విఆర్ తీసుకోవడం, అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన లో చేరడం చకచకా జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార పర్యటన లో జె.డి ప్రసంగాలు ఓటర్లను ఎంతగానో ఆకట్టుకునేవి. ఆయన్ను విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక.. ఒక నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు విశాఖ జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తారని.. ప్రధానంగా విద్యావంతులు ఎంతో సంతోషించారు. పోలింగ్ రోజున ఒకానొక దశలో విశాఖ ఎంపీ గా ఆయన గెలుపు ఖాయం అవుంతుందన్నట్లుగా ప్రచారం సాగింది.
ఒపీనియన్ పోల్స్లో ఏ పార్టీ అభ్యర్థి కి ఓటేశామన్న విషయాన్ని వీరాభిమానులు తప్ప ఇతరులు చెప్పేందుకు ఇష్టపడరు. కానీ జేడీ లక్ష్మీనారాయణ పేరును అటు తెలుగుదేశం.. ఇటు వైఎస్ఆర్సిపి.. కార్యకర్తలు సైతం బాహాటంగా చెప్పారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేసిన వాళ్లు సైతం… ఎంపీ ఓటును జేడీ లక్ష్మీనారాయణకు వేశామని బహిరంగంగా చెప్పారు. దీంతో ఆయన గెలుపు ఖాయమని అంతా భావించారు. ఫలితాల్లో ఆఖరుకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ఎం వి వి సత్యనారాయణ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
లక్ష్మీనారాయణ మూడో స్థానంలో నిలిచిన ప్పటికీ 23.3 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 2.88 లక్షల మంది ఆయనకు ఓటేశారు. అంతగా విశాఖ వాసులు ఆయన్ని అభిమానించారు. రెండవ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్ నిలిచారు.
Must Read ;- ఆధిపత్య పోరులో అభివృద్ధి మరిచారు.. ఉత్తరాంధ్ర వాసుల ఆవేదన
కొన్నాళ్ల తర్వాత పట్టించుకోవడం మానేశారు..
ఎన్నికల ఫలితాల తర్వాత.. కొద్దిరోజులు విశాఖలోనే కనిపించిన జెడి లక్ష్మీనారాయణ ఆ తరువాత ఇటువైపు కన్నెత్తి చూడడం మానేశారు. ఏ పార్టీ తరఫున.. ఎటువంటి ప్రజా పోరాటాల్లోనూ ఆయన కానరాలేదు. జనసేనకు కూడా పూర్తిగా దూరం అయ్యారు. దీంతో ఆయన కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే అని భావనకు విశాఖ వాసులు వచ్చేసారు.
ఇన్ని పరిణామాల మధ్యలో ఇటీవలి కాలంలో వరుసగా వ్యవసాయ బిల్లుల్లోని లోపాల గురించి.. టీవీ ఛానెళ్ల చర్చల్లో విశ్లేషణలు అందిస్తున్న జేడీ లక్ష్మీనారాయణ.. బంద్ రోజున విశాఖలో కనిపించడం, తలవనితలంపుగా అయినప్పటికీ.. కాసేపు బంద్ నిరసనల్లో పాల్గొనడం యాదృచ్ఛికం.
Also Read ;- పంచగ్రామాల భూవివాదం.. ఇప్పుడే గుర్తుకొచ్చిందా?