అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రముఖులకు అవమానల వేదికగా మారింది.కేంద్ర ప్రభుత్వ పెద్దల ఎదుటే ప్రతిపక్ష నాయకుల పై జగన్ సర్కార్ తన కక్ష సాధింపు ధోరణిని కొనసాగించింది. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చినా, కేంద్ర బలగాల లిస్ట్ లో పేరు ఉన్నా..ప్రోటోకాల్ విస్మరిస్తూ, అనుమతి నిరాకరిస్తూ నిండు సభ సాక్షిగా ప్రతిపక్ష నేతలను, ప్రముఖులను ఘోర అవమానానికి గురి చేసింది వైసీపీ ప్రభుత్వం.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా విప్లవ వీరుడి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లను చేశాయి.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సంబంధించి అన్ని పార్టీలకూ, పలువురు ప్రముఖులకు కేంద్రం ఆహ్వానాలు పంపింది.అయితే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇక్కడే తన కక్ష సాధింపు ధోరణిని అవలంభించింది.ప్రధానంగా సొంత పార్టీ ఎంపీ మొదలు ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల పట్ల జగన్ సర్కార్ తన వివక్షను బహిరంగంగానే చూపించింది.
ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు బయలుదేరిన స్థానిక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై వైసీపీ ప్రభుత్వం తన విద్వేషాన్ని చూపుకుంది.హైదరాబాద్ నుంచి భీమవరం బయలుదేరిన రఘురామకృష్ణరాజును అడ్డుకునేందుకు అన్ని విధాల కుట్రలు చేసింది.చాలాకాలం తర్వాత రఘురామ సొంత నియోజకవర్గానికి వస్తుండడంతో ఆయన అభిమానులు పెద్ద ర్యాలీ నిర్వహించారు. దీంతో రఘురామ ప్రధాని పర్యటనకు వస్తే తమ ప్రాభల్యం తగ్గిపోతుందని భావించిన జగన్ అండ్ కొ ఎలాగైనా ఆయనను అడ్డుకోవాలని కుట్రలు పన్నారని రఘురామ కృష్ణంరాజు మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. అదే విధంగా ఆయన పర్యటనను అడ్డుకున్నారు. RRR కి ఆహ్వానం పలుకుతూ ర్యాలీ నిర్వహించన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి చేత, వారి తల్లిదండ్రుల చేత ఆయనకు ఫోన్ చేయించి తన పర్యటనను రాదు చేసుకోవాలని, లేకపోతే తమ పిల్లలను వదిలిపెట్టడం లేదని చెప్పారు. దీంతో యువకుల భవిష్యత్తు ముఖ్యమని భావించిన రఘురామ మార్గ మధ్యమ నుంచే వెనుదిరిగారు.
ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలోనూ జగన్ ప్రభుత్వం కక్ష సాధింపును కొనసాగించింది.కేంద్ర పర్యాటక శాఖ నుంచి అందిన ఆహ్వానం మేరకు టిడిపి తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు హోదాలో అచ్చెనాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇక కార్యక్రమానికి విచ్చేసిన అచ్చెన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి ప్రధానిని ఆహ్వానించేందుకు హెలిప్యాడ్ వద్దకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. కాగా, తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్నాయుడు పేరు లేదని జిల్లా కలెక్టర్ ఆయనను అక్కడకు రాకుండా చేశారు.కాగా, ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో అచ్చెన్నాయుడు పేరు పొందుపరిచి ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా కలెక్టర్కు చెప్పినప్పటికీ ఆయన మాత్రం తన జాబితాలో లేదని అచ్చెన్నను అనుమతించడం కుదరదని తేల్చిచెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పటంతో బసచేసిన ప్రాంతంలోని అచ్చెనాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే కేంద్ర మాజీ పర్యాటక శాఖ మంత్రిగా మెగాస్టార్ చిరంజీవిని ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆహ్వానించారు.కాగా కార్యక్రమానికి హాజరైన ఆయనకు అవమాన భారం తప్పలేదు.ప్రధాని మోడీ సభ వేదిక పై మొత్తం 11 మందికి అవకాశం కల్పించగా అందులో చిరంజీవి ఒకరు. అయితే మోడీ సభా ప్రాంగణానికి చేరుకునేంతవరకు చిరంజీవికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ వాహనం పంపలేదు. దీంతో చిరంజీవి ప్రసంగించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన అభిమానులు సైతం జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి శత్రువైనా ఇంటికి వస్తే ఆదరించాలి అనేది మన పెద్దల నుంచి వస్తున్న సంస్కృతి. అలాంటిది అల్లూరి 125వ జయంతి వేడుకలు వంటి ఒక చక్కటి కార్యక్రమంలో ఆహ్వానితులుగా వచ్చిన ప్రతిపక్ష నేతలు, ప్రముఖుల పట్ల జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది.రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనే ఈ వేడుకను వైసీపీ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకోవడం పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.