ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే తనదైన పాలనను స్పష్టంగా చూపిస్తున్నారు. ఒక్క రాజధాని అమరావతి పైన ఫోకస్ చేయడమే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇతర ప్రాంతాల డెవలప్ మెంట్ విషయాలను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన సీఎం కాగానే, వరుసగా పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. గతంలో ఒప్పందాలు జరిగిన కంపెనీలతో పాటు.. కొత్త కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇటీవల టాటా ప్రతినిధులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరుపతి జిల్లాలో నేడు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు.
తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమలను చంద్రబాబు నేడు ప్రారంభిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇలా ఒకేరోజు ఏకబిగిన 15 కంపెనీలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తున్నారు. సత్యవేడు నియోజక వర్గం శ్రీసిటీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన మధ్యాహ్నం జరిగింది. శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న సంస్థల్లో సుమారు 2,700 మందికి ఉపాది పొందనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించటంతో పాటు మరికొన్ని కంపెనీలకు శంకుస్థాపనలు సీఎం చేయనుండడం సంచలనంగా మారింది.
అలాగే మరో రూ.1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుందని తెలిసింది. చంద్రబాబు చేతులు మీదుగా సౌత్ కొరియాకు చెందిన ఎల్జీకెమ్, ఇజ్రాయెల్ కు చెందిన నియోలింక్, జపాన్ కు చెందిన నైడిక్, జర్మనీకి చెందిన బెల్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, అడ్మైర్, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్, ఇఎస్ఎస్కేఏవై, ఆటో డేటా, ఈప్యాక్, ఎవర్ షైన్, జెన్ లెనిన్, జేజీఐ, త్రినాథ్ వంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాక, ఏపీ ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనుంది.
పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి వెంటవెంటనే అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో పాటు వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను చంద్రబాబు ప్రభుత్వం అందిస్తోంది. కేవలం నిరుద్యోగ సమస్యను రూపుమాపడం సహ, పరిశ్రమల స్థాపన జరిగిగే ప్రాంతీయంగా డెవలప్ మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పక్క రాష్ట్రాలతో పోటీ నెలకొన్న వేళ వారిని రాష్ట్రానికి రప్పించడం కోసం మంచి ప్రోత్సాహకాలను సైతం కొత్త ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.











