ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. 45 సంవత్సరాలు దాటిన 47 లక్షల మందికి మొదటి డోసు వేసిన ప్రభుత్వం రెండో డోసు వేయడంలో విఫలమైంది.ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది మొదటి డోసు టీకా వేయించుకుని 42 రోజులు దాటిపోయింది. అయినా వారికి రెండో డోసు అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో నెల రోజులకు కూడా రెండో డోసు ప్రక్రియ ముగిసే పరిస్థితి కనిపించడం లేదు.ఏపీలో ఇప్పటికే కొత్తగా కరోనా టీకాలు ఎవరికీ వేయడం లేదు.కేవలం మొదటి డోసు వేయించుకుని, రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రమే రెండో డోసు కోసం ఆరోగ్య కేంద్రాలకు రావాలని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.
ప్రణాళికా లోపం
ఏపీ ప్రభుత్వం కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. మొదటి డోసు తీసుకున్న వారు, మరల రెండో డోసు కోసం వారు ఆరోగ్య కేంద్రాలకు వచ్చేప్పటికే టీకాలు సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం కేంద్రం పంపించే టీకాల మీదే ఏపీ ప్రభుత్వం ఆదారపడటంతో టీకా కార్యక్రమం వేగం పుంచుకోవడం లేదు. కేవలం టీకాల కొనుగోలుకు రూ.45 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీంతో 4.5 కోట్ల మందికి టీకాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.రెండో టీకా వేసేందుకే నెల రోజులు పడితే ఇక 45 సంవత్సరాలు నిండిన మరో కోటి మందికి టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో అంచనా వేయలేకపోతున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే కేవలం 45 సంవత్సరాలు దాటిన వారికి రెండు డోసుల టీకాలు వేయడానికి 8 నెలలు సమయం పట్టేలా కనిపిస్తోంది.
హాట్ స్పాట్లుగా టీకా కేంద్రాలు
కరోనాను అడ్డుకునేందుకు టీకాలు వేసే కేంద్రాలు ఏపీలో కరోనా హాట్ స్పాట్లుగా మారాయి.మార్చి నెలలో టీకాలు వేయించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపని జనం, ప్రతి ప్రాంతంలో కరోనాతో మరణాలు చోటు చేసుకోవడంతో టీకా కేంద్రాలకు ఎగబడుతున్నారు.చాలా జిల్లాల్లో టీకా కేంద్రాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నాయి.కనీసం ముందు వచ్చిన వారికి టోకెట్లు ఇచ్చి,మిగతా వారిని పంపించేందుకు కూడా సిబ్బంది చొరవ తీసుకోకపోవడంతో జనం తోపులాటకు దిగుతున్నారు.కరోనా టీకా కేంద్రాల వద్దే కొత్తగా కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
క్లారిటీ లోపించింది
ఏపీకి ఎన్ని టీకాలు వస్తాయి.ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి.అనే విషయంలో కూడా ఏపీ ప్రభుత్వానికి క్లారిటీ లోపించింది.ప్రతి రోజూ ఆరోగ్య కేంద్రాల్లో టీకాల కోసం జనం వేల సంఖ్యలో వస్తున్నారు.టీకాలు అందుబాటులో లేవని సిబ్బంది చెబుతున్నారు.జిల్లాలవారీగా కనీసం టీకా షెడ్యూలు కూడా విడుదల చేయకపోవడం ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.వారంలో మూడు రోజులు లేదంటే నాలుగు రోజులు ఇలా షెడ్యూలు ప్రకటిస్తే ప్రజలు కూడా ఆయా రోజుల్లోనే కరోనా టీకాలు వేయించుకునేందుకు వస్తారు.అలా కాకుండా టీకా ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు వేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.అందుకే ఉదయం ఆరుగంటలకే టీకా కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిలబడిన తరవాత వైద్య సిబ్బంది వచ్చి ఇవాళ టీకాలు రాలేదని చెప్పడంతో జనం తిరగబడుతున్నారు.
పత్తాలేని అధికారులు
గుంటూరు జిల్లాలో ఇవాళ ఇప్పటికీ రెండో డోసు టీకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.ఉదయం ఆరు గంటల నుంచి జనం పడిగాపులు పడుతున్నారు.12 గంటల తరవాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. ఇప్పటికీ టీకాలు వేయడం ప్రారంభించలేదు.అలాగని టీకాలు లేవని కూడా చెప్పకపోవడంతో జనం ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు తీరారు.కరోనా టీకాలు వేసే తేదీలను స్పష్టంగా ప్రకటించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.ఎన్ని టీకాలు వస్తే అంతమందికే టోకెన్లు ఇస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు.మొత్తం మీద కరోనా కట్టడిలోనే కాదు,కరోనా టీకాలను ప్రణాళిక ప్రకారం వేసే కార్యక్రమంలోనూ ఏపీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.