కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇప్పుడు ఏపీలో సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకొనేందుకు.. అదే స్థాయిలో టూరిస్టులు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. కోనసీమ, యానాం ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తోంది. ఈసారి తొలిసారి కేరళ తరహాలో పడవ పోటీలనూ ఏర్పాటు చేశారు. ఈ పోటీల కోసం మన రాష్ట్రంతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటక వంటి ప్రాంతాల నుంచి బోట్ రేసింగ్ టీములు కోనసీమలో దిగాయి.
ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో.. పీఠికాపుర సంక్రాంతి వేడుకల పేరుతో సంబరాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులకు తోడు.. కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సోషల్ మీడయాలో స్థానికులు చేస్తున్న రీల్స్, వీడియోలకు విపరీతమైన పాపులారిటీ వస్తోంది. సంక్రాంతి సందడి సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకొంది.
వేలాది మంది పర్యాకులు.. సంక్రాంతి సంబరాలను చూసేందుకు కోస్తాంధ్ర ప్రాంతాలకు తరలి రావడం.. స్థానిక ఆర్ధిక వ్యవస్థకు బూస్టింగ్లా మారుతోంది. చాలా చోట్ల హోటళ్లు హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నాయి. రెస్టారెంట్లు, ఫుడ్ పార్కులు టూరిస్టులతో కళకళలాడుతున్నాయి. హస్తకళలు, చేనేత వస్త్రాలు ఇతర స్థానిక ఉత్పత్తులకు పర్యాటకుల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని.. అధికారికంగా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం పర్యాటక రంగానికి ఊతమిస్తోంది.











