నల్లగొండలో ఇక తెలుగుదేశం (టీడీపీ ) పార్టీ శకం ముగిసినట్టేనా…? రెండు దశాబ్ధాలకు పైగా జిల్లాలో తిరుగులేని శక్తిగా చెలామణి అయిన పార్టీ కథ ఇక కంచికి చేరినట్టే కనిపిస్తోంది..! వరస వలసలు.. నాయకత్వ లేమి.. ఆ పార్టీని గత చరిత్ర పుటల్లోకి జారిపోయేలా చేసినట్టు కనిపిస్తోంది.. ఆధిపత్యం నుంచి అథః పాతాళానికి చేరిన టీడీపీ మహాభినిష్క్రమణ పరిపూర్ణమైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన నేతగా పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత ఎన్.టి.రామారావు (ఎన్టీఆర్)కు విజయం అందించిన జిల్లా. సంవత్సరాల తరబడి భువనగిరి, ఆలేరు, నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట వంటి నియోజకవర్గాలను పెట్టని కోటలుగా మలుచుకున్న పార్టీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్టీ. కానీ… చివరకు జిల్లాలో టీడీపీ పరిస్థితి మరీ దైన్యంగా తయారైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో పన్నెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్ధులు ఒక్క స్థానంలోనూ గట్టెక్కలేకపోయారు. మరీ విషాదమైన పరిణామం ఏంటంటే.. 2018 ఎన్నికల్లో అయితే కనీసం ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేయలేక పోయింది. తన బద్ద శత్రువు.. అసలు టీడీపీ పుట్టుకకు ప్రధాన కారణమైన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మహా కూటమిలో చేరినా లాభం లేక పోయింది. . గతమెంతో ఘనం..!
తెలగుదేశం పార్టీకి నల్లగొండ జిల్లాలో మంచి రికార్డే ఉంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు కోల్పోయిన భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ 1985 నుంచి 2009 ఎన్నికల వరకు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధులుగా ఎలిమినేటి మాధవరెడ్డి, ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి గెలుస్తూ వచ్చారు. జిల్లాలోని తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో విజయాలు సాధించిన చరిత్ర ఆ పార్టీకి ఉండింది. ఆ పార్టీ మద్దతుతో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండలో పలు ఎన్నికల్లో విజయాలు సాధించాయి. పన్నెండు స్థానాల్లో అన్ని చోట్లా పోటీ పడిన టీడీపీకి దేవరకొండ, మిర్యాలగూడెం, హుజూర్నగర్, మునుగోడు, నకిరేకల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. నల్లగొండ జిల్లా పరిషత్కు సైతం ఆ పార్టీ ప్రాతినిధ్యం వహించింది. 1985 శాసన సభ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు విజయం వరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులతో నల్లగొండ జిల్లాలో టీడీపీ ఉజ్వలంగా వెలిగింది. కానీ ఇపుడా పార్టీ పరిస్థితి నామమాత్రం కన్నా అధమ స్థాయికి చేరి అడ్రస్ గల్లంతైంది.
వలసలతో చిక్కిశల్యం !
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీ నాయకులు స్వేచ్ఛగా ఉద్యమంలో పాల్గొనలేక పోయారు. పార్టీ నాయకత్వం ఆచరించిన రెండు కళ్ల సిద్ధాంతం టీడీపీ నాయకులను ఎటూ
తేల్చుకోలేకుండా చేసింది. అప్పటికే టీడీపీ నాయకులు ఒక్కొక్కరే పార్టీనీ వీడి ఇతర పార్టీల్లో చేరారు. ప్రధానంగా టీడీపీ నాయకులు టీఆర్ఎస్లో కుదురుకున్నారు. రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్ఎస్ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టడంతో జిల్లా టీడీపీ వలసతో చిక్కి శల్యమైంది. జిల్లాల విభజన తర్వాత ఏ జిల్లా కమిటీలు ఆ జిల్లాకు నియమించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా పలువురు నాయకుల టీఆర్ఎస్ బాట పడితే ద్వితీయార్ధంలో కాంగ్రెస్ బాట పట్టారు. జిల్లాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నేతలు సైతం పార్టీని వీడి బయట పడ్డారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు చాలా ముందుగానే టీఆర్ఎస్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఉమామాధవ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఆమె తన యుడు పార్టీ సందీప్ రెడ్డి ఇపుడు టీఆర్ఎస్ నుంచి యాదాద్రి భువనగిరి (కొత్త జిల్లా)కి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్ సైతం సైకిల్ దిగి కారెక్కి…. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. నల్లగొండ జిల్లా అ«ధ్యక్షునిగా బిల్యానాయక్, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన పటేల్ రమేష్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక, ఆఖరుగా ఆ పార్టీకి తెలంగాణలో పెద్దదిక్కు అనదగిన సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా టీడీపీ నుంచి బయటకు రావడంతో .. టీడీపీ ఉనికి నామమాత్రంగా కూడా లేకుండా అయ్యింది. ఎన్నికల రాజకీయాలను ప్రాతిపదికగా తీసుకుంటే .. గ్రామ పంచాయతీలు మొదలు ఏ స్థాయిలోనైనా ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క పదవి కూడా చేతలో లేకుండా అయ్యాయి. నాయకత్వమంతా సొంత లాభం చూసుకోవడంతో జిల్లాలో టీడీపీ అనాథగా మారింది. జిల్లాలో పార్టీని ఉద్దరిద్దామన్న ఆలోచన కూడా ఆ పార్టీ రాష్ట్ర నాయత్వానికి ఏ మాత్రం లేదని ఇప్పటికే తేటతెల్లం అయ్యింది. ఉవ్వెత్తున ఎగిసిన పడిన అలా లేచిన టీడీపీ అంతే వేగంతో విరిగి పyì .. మరింక లేవలేదు.
కేపీ











