ప్రొఫెసర్ కోదండరామ్.. ఈ పేరుకు రాష్ట్రంలో అంతో ఇంతో పాపులారటీ ఉంది. తెలంగాణ ఉద్యమంలో అన్నిపక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చి ముందుండి తెలంగాణరాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులు కోదండరామ్. తనకు చట్టసభల్లో కూర్చోవాలనే కోరిక, ఆశయం ఉంది. అయితే 2018 ఎన్నికల్లో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అది సాధ్యంకాలేదు. కానీ ఈసారీ చట్టసభల్లో కూర్చోవాలనే తన ఆశయాన్ని ఆయన జారవిడ్చుకోదల్చుకోలేదు. దీనికోసం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి, అందులో విజయం సాధించి మండలిలో అడుగుపెట్టాలని కోదండరామ్ నుకుంటున్నారు. అందుకు ఆయన టిఆర్ఎస్, బిజెపి మినహా ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకునే పనిని నెల రోజులుగా చేస్తున్నారు. అన్నిపార్టీల నాయకులను, ఉద్యోగ, కుల సంఘాలు, మేథావులను కలిసేందుకు కాలికి బలపం కట్టుకుని జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే తమ పార్టీ నాయకులు కూడా కోదండరామ్కు మద్దతిచ్చే విషయంపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిడిపి పార్టీ నాయకులను కలిశారు కూడా.
బెడిసికొట్టిన వ్యూహం..
అయితే ఇన్ని రోజులుగా కోదండరామ్ చేసిన ప్రయత్నం, తమ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఏ పార్టీలు తనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, టిజెఎస్, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. జనగాం నుచి పోటీచేయాలని కోదండరామ్ ఆ ఎన్నికల్లో అనుకున్నారు. కానీ చివర్లో పొన్నాల లక్ష్మయ్య కోసం కోదండరామ్ పోటీ నుంచి తప్పుకోవల్సి వచ్చింది. మళ్లెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు రాజకీయ మద్దతు విషయంలో చేయూత అందిస్తామని కాంగ్రెస్పార్టీ నాయకులు కోదండరామ్కు ఆనాడు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో దానిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని ఆయన కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కానీ ఇప్పుడు కోదండరామ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చే విషయంలో ప్లేట్ ఫిరాయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని కూడా బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ పిసిసితో చెప్పినట్లు సమాచారం. దీంతో కోదండరామ్ ఇంతవరకు మద్దతు కూడగట్టుకునే విషయంలో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్లుగా అర్ధం చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఒకప్పటి మిత్రపక్షాలైన సిపిపై, టిడిపి, ఇంటిపార్టీల మద్దతును కూడా కోదండరామ్ కోరారు. కానీ ఆ పార్టీలు సైతం తమ అభ్యర్థులను కోదండరామ్కు పోటీగా నిలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. సిపిఎం పార్టీ ఇప్పటికే కోదండ రామ్కు మద్దతు ఇవ్వబోమని చెప్పిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈసారీ కూడా అంతేనా?..
టిడిపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మద్దతు తీసుకొని ఎమ్మెల్సీగా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలనే కోదండరామ్ కోరికకు ఈసారీ కూడా బ్రేక్ పడినట్లేననే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఓ వైపు బలమైన అధికారపక్షం, మరోవైపు మిగతా విపక్షపార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో కోదండ రామ్కు పోటీగా ఎన్నికల బరిలో దింపుతున్నాయి. కోదండరామ్ కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. అన్ని పార్టీలు అదే స్థానంపై ఫోకస్ పెట్టడంతో ఎవరికి లాభం చేకూరుతుందోనని రాజకీయపార్టీలన్నీ లెక్కలు వేసుకుంటున్నాయి. టిఆర్ఎస్ మాత్రం రెండవ సారీ కూడా అక్కడ తమ అభ్యర్థే గెలవడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తుంది. ఇలా బహుముఖ పోరులో కోదండరామ్ స్వప్నం నెరవేరేనా? లేదా అని చూడాలి మరి.