(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
చీరాల- పేరాల ఉద్యమానికి పుట్టినిల్లు.. చిన్న ముంబై గా పిలవబడే.., క్షీరపురి చీరాల వైసీపీలో రాజకీయం మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకూ ఆమంచి వర్సెస్ కరణంగా సాగిన గ్రూపు రాజకీయాలు వారం రోజుల్లో యూ టర్న్ తీసుకున్నాయి. నిన్నటి దాకా ఏ ముగ్గురూ అయితే ఒక్కటిగా ముందుకు సాగుతూ.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచిని ముప్పు తిప్పలు పెట్టారో… వాళ్లే నేడు పదవీ కాంక్షతోనో, అధికారం కోసమో లేక ఆధిపత్యం కోసం, లేక అస్తిత్వం కోసం గానీ ఇప్పుడు రెండుగా చీలిపోయారు. మొన్నటి వరకూ వైసీపీ పార్టీలో ఉమ్మడి కుటుంబం డ్రామాను నడిపిన వాళ్లు.., ఇప్పుడు పందెపు కోళ్లలా ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకుంటూ చీరాలలో కొత్త కుంపటికి తెరతీశారు. ఎవరు వాళ్లు.. అనుకుంటున్నారా..? వాళ్లే ఎమ్మెల్యే కరణం బలరాం, పోతుల సునీత, పాలేటి రామారావు.
కరణం బలరామకృష్ణమూర్తి.. ఈ పేరు రాజకీయాల్లో చాలా మందికి సుపరిచితం. దశాబ్దాలుగా టీడీపీలో కీలక నేతగా మెలిగిన కరణం.., 1978లో ఎమ్మెల్యేగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్.టి.ఆర్. నుంచి ఇందిర వరకూ అందరికీ ఆప్తుడిగా మెలిగారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత తనకు ఖిల్లా లాంటి అద్దంకిలో ఓటమి పాలై.., టీడీపీలో ఎమ్మెల్సీగా కొనసాగారు. 2019 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తప్పని పరిస్థితిలో అద్దంకిని ఒదులుకుని., చీరాలలో వైసీపీ అభ్యర్థి ఆమంచి షాక్ ఇస్తూ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి చీరాల్లో ఆమంచి వర్సెస్ కరణం పోరు రోజూ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తలపిస్తూ.., దాడులు, ప్రతిదాడులతో రణరంగాన్ని తలపించి.., చీరాల అంటే క్షీరపురి అనే పేరు కాస్తా.. ఆమంచి వర్సెస్ కరణం గొడవలకు కేరా ఆఫ్ అడ్రస్ గా మారింది.
వైసీపీ అధిష్టానం అండదండతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఓ వైపు.., కరణం, పోతుల, పాలేటి రామారావు మరోవైపు.., మొన్నటి వరకూ చీరాలలో ఢీ అంటే ఢీ అని వైసీపీలో వర్గపోరును పతాక స్థాయికి తీసుకెళ్లారు. పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఈ రెండు వర్గాలు ఎదురుపడ్డాయి అంటే ఘర్షణ వాతావరణం నెలకొనడం సాధారణంగా మారింది.
కానీ, వారం రోజుల నుంచి చీరాలలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నిన్నటి వరకూ కలిసి మెలసి ఆమంచిని ఎదుర్కొన్న కరణం వర్గంలో చీలిక వచ్చింది. ఇప్పుడు కరణం, పాలేటి ఓ వైపు పోతుల సునీత ఓ వైపుగా వర్గపోరు ప్రారంభమైంది. 2024లో చీరాల టికెట్ కోసం పోతుల సునీత తన వ్యూహాన్ని ఒక్కసారిగా మార్చి.., ఎప్పుడూ లేనట్లు కరణం బలరాంపై విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాలేటీ రామారావు., 2024లో మా ఎమ్మెల్యే బలరాం నే అనడంతో సునీత ఒక్కసారిగా జోక్యం చేసుకుని.., పాలేటిపై విరుచుకుపడ్డారు. ఓ దశలో బలరాం, సునీత నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది. మీరు వచ్చింది అధికారం కోసమేగా అని కరణంని పోతుల సునీత ప్రశ్నించడంతో.., కరణం కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానిని మరిపిస్తూ.. వేటపాలెం మండలం బచ్చుపాలెం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పోతుల సునీత.., బలరాంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే సరికే కార్యక్రమాన్ని ముగించి బలరాం వెళ్లిపోవడంతో.., సునీత అధికారులపై విరుచుకుపడ్డారు. ఇళ్లలో కూర్చోండి చేత కాకపోతే అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.., ‘బలరాం ఎమ్మెల్యే గిరి దేనికి’ అంటూ అసభ్యమైన, రాయలేని పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నిన్నటి వరకూ కలసి కట్టుగా ఆమంచిపై విరుచుకుపడిన పోతుల, కరణం, పాలేటి.., వారం రోజుల వ్యవధిలో వీళ్లే రెండు వర్గాలుగా మారి చీరాలలో వర్గ రాజకీయాల్లో నిప్పును రాజేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే చీరాలలో ఇప్పటికే కరణం వర్సెస్ ఆమంచి గొడవలతో గ్రామాల్లో చిన్న సమస్యకు కూడా తలలు పగిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు వీటికి తోడు పోతుల సునీత వర్సెస్ కరణం వర్గం పోరుతో చీరాల రాజకీయ ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.