(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని వ్యవహారం హైకోర్టుకు చేరింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలో రాజధాని పెడతామంటే భూములిచ్చామని, నేడు మూడు రాజధానులంటున్నారంటూ రైతుల హైకోర్టులో కేసులు వేశారు. అమరావతి రాజధానిపై మొత్తం 97 కేసులు నమోదయ్యాయి. అమరావతి రాజధానిపై నమోదైన కేసులు, అనుబంధ కేసులన్నీ కలిపి హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. దీంతో ‘రాజధాని ఇక్కడే ఉంటుందన్న’ రైతుల ఆశలు సజీవంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రభుత్వం మారితే ఒప్పందాలు రద్దవుతాయా?
గత ప్రభుత్వం సీఆర్డీయే ఏర్పాటు చేసింది. రాజధానికి భూమిలిచ్చిన రైతులతో ఒప్పందం చేసుకుంది. రైతులిచ్చిన భూమిలో నాలుగో వంతు భూమిని అభివృద్ధి పరచి మరలా వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాదు, అమరావతిలో రాజధాని అభివృద్ధి జరుగుతుందని, రైతులిచ్చిన నాలుగోవంతు భూమికి మంచి ధర వస్తుందని ఆనాడు ప్రభుత్వం చెప్పిన మాటలు విని రైతులు భూములిచ్చారు.
2019లో ప్రజలచ్చిన తీర్పుతో ప్రభుత్వం మారింది. స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీంతో అమరావతి రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం రాజధానిపై వచ్చిన కేసులన్నీ కలపి ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ కేసులపై రోజువారీ విచారణ వేగంగా సాగుతోంది. తుది తీర్పు రావాల్సి ఉంది.
హైకోర్టులో తీర్పును సుప్రీంలో ఛాలెంజ్ చేసే అవకాశం
హైకోర్టులో రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే, అమరావతి రాజధాని రైతులు సుప్రీంను ఆశ్రయిస్తారు. అంటే అమరావతి రాజధాని భవిష్యత్, అత్యున్నత న్యాయస్థానం చేతిలో ఉందనే చెప్పాలి. హైకోర్టులో తీర్పు ఏ రీతిగా ఉన్నప్పటికీ.. ఉభయ పక్షాలూ సుప్రీంలో సవాలు చేసి.. తాము చెబుతున్న వాదనలోనే న్యాయం ఉన్నదని పట్టుపట్టే అవకాశం ఉంది.
గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి
ఏ ప్రభుత్వమైనా చేసుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా కొత్తగా వచ్చే ప్రభుత్వాలు రద్దు చేయడానికి వీల్లేదు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ ఇదే జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు జరిగాయని, వైసీపీ ప్రభుత్వం వారికి చెల్లింపులు నిలిపి వేసింది. దీనిపై విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. వారికి విద్యుత్ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది.
విద్యుత్ ఒప్పందాల విషయంలో జరిగింది.. అమరావతి విషయంలోనూ రిపీట్ కానుందనే న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నరు. రైతులతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటే వారికి 5 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించడం ప్రభుత్వానికి సాధ్యం అవుతుందా? అంటే కష్టమేనని చెప్పుకోవచ్చు.
అందుకే మూడు రాజధానులు
కోర్టుల్లో కేసులను ఎదుర్కొనేందుకే మూడు రాజధానుల ప్రకటన చేశారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి నుంచి పూర్తిగా రాజధాని ఎత్తివేయడం న్యాయపరంగా అనేక చిక్కులు తెచ్చిపెడుతుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం ముందుగా మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంటే కోర్టులు ఒకవేళ ప్రశ్నించినా అమరావతి నుంచి రాజధాని తరలించడం లేదనే సమాధానం చెబుతారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసిన నేతలు, న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారనే విమర్శలు అమరావతి అనుకూల వర్గాలనుంచి వినిపిస్తున్నాయి.
న్యాయవ్యవస్థే కాపాడాలి
అమరావతికి శంకుస్థాపన చేసిన నాటి, నేటి ప్రధాని మోడీ మాత్రం ఊరకుండిపోయారు. ఢిల్లీని తలదన్నే రాజధాని వస్తుందని శంకుస్థాపన సమయంలో ప్రకటించిన మోడీ నేడు నోరుమెదపడం లేదు. ఆయన పాల్గొన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగి ఇవాళ్టికి అయిదేళ్లు నిండుతున్నాయి. రైతుల ఆందోళనలు కూడా మిన్నంటుతున్నాయి.
అందుకే రాజకీయపార్టీలపై రైతులు ఆశలు వదులుకున్నారు. కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే తమను గట్టెక్కిస్తుందని హైకోర్టు చిత్రపటాలకు పూజలు చేస్తున్నారు. వారి పూజలు ఫలించాలని ఆశిద్దాం.