ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం.పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. నిజాం నవాబులపై పోరాటం చేస్తూ తన సహచరుడిగా ఉంటూనే నమ్మించి మోసం చేయడం వల్ల 39 సంవత్సరాలకే బలైపోయిన పోరాట యోధుడు.
అసలు ఎవరు ఈ కొమురం భీమ్?
హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. 1901 అక్టోబర్ 22న ఆదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్ మండలం సంకేపల్లిలో గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించాడు.
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకి
భీమ్ పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించడంతో కుటుంబంతో కలిసి కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. ఆ సమయంలో నిజాం పాలన సాగుతుండగా దానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. అన్ని రకాల నిజాం అధికారాలను, చట్టాలను, న్యాయస్థానాలను వ్యతిరేకించాడు.
నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నం
ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడి, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడేవాడు భీమ్. ఆ క్రమంలోనే భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’నినాదానికి ప్రతీకగా నిలిచాడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినాదించేవాడు.
కరిమెర టు అస్సాం టు కరిమెర
తండ్రి మరణం తరువాత కుటుంబం మొత్తం కరిమెర ప్రాంతానికి వలస వచ్చి జీవనం సాగిస్తుండగా సిద్ధిఖీ అనే వ్యక్తి వీరి పొలాన్ని ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం పారిపోయాడు.
కొన్ని సంవత్సరాల తరువాత కరిమెర తిరిగి వచ్చిన భీమ్ నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్క తాటిపై నడిపించి ఉద్యమాన్ని సాగించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు.
నమ్మంచి..నవాబులకు పట్టించాడు
కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి భీమ్ ఉద్యమంలో ఉంటునే సమాచారం మొత్తాన్ని నిజాం అధికారులకు చేరవేసేవాడు. ఆ క్రమంలోనే 1940 అక్టోబర్ 27న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ను హతమార్చాయి. ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.
‘మా ఊర్లో మా రాజ్యాం ’ అనే నినాదంతో ఉద్యమం
ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈవేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్ గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు.
‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లోద్దుల్లో తుడుం మోగించాయి. కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లోద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తుంది.