కొవిడ్ బాధితులకు బెడ్ కన్ఫర్మేషన్ అయినట్టు లిఖిత పూర్వక అనుమతి,కొవిడ్ కంట్రోల్ రూం జారీ చేసిన పాస్ ఉంటేనే తెలంగాణలోనికి ప్రవేశం ఉంటుందని చెబుతూ రెండురోజుల క్రితం ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్లు నిలిపివేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తింది.ఈ కేసు విచారణలో ఉంది. అయితే శుక్రవారం మరోసారి అంబులెన్స్లను తెలంగాణలోకి అనుమతించకుండా నిలిపివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.కర్నూలు జిల్లా-తెలంగాణ సరిహద్దు వద్ద గురువారం రాత్రి నుంచి అంబులెన్స్లు నిలిపివేసిన కారణంగా ఇద్దరు కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు బాధితులు చెబుతున్నారు.
ఈ పాస్ ఉంటే అనుమతిస్తున్నామంటూ..
అదే సమయంలో తెలంగాణ పోలీసు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం తాము అన్ని అంబులెన్స్లను అడ్డుకోవడం లేదని,ఈ పాస్ ఉంటే అనుమతిస్తున్నామని చెబుతున్నారు. బెడ్ కన్ఫర్మేషన్ లేకుండా హైదరాబాద్కు వస్తే.. బెడ్ దొరకకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని,కొవిడ్ వ్యాప్తికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు.ఈపాస్ ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు.ఇక అంబులెన్స్లు అడ్డుకోవడంతో పాటు ఉదయం 10 గంటల తరువాత తెలంగాణలోనికి సరైన కారణం లేకుండా వస్తున్న వాహనాలను నిలిపివేస్తుండడంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోతున్నాయి.
ఎవరి వాదన వారిది..
తెలంగాణలో రికార్డు అవుతున్న కొవిడ్ కేసుల్లో 30 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివేనని గతంలోనూ అప్పటి వైద్య మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి కారణాన్నే హైకోర్టుకు చెప్పింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, చత్తీస్ఘఢ్ల నుంచి కేసులు వస్తున్నాయని,ఆయా ప్రాంతాల్లో ప్రాథమికంగా చికిత్స తీసుకుని పరిస్థితి ప్రమాదకరంగా మారిన పక్షంలో ఇక్కడి వస్తున్నారని,వారితోపాటు సహాయకులు ఒకరిద్దరుచొప్పున వస్తున్నారని ఆసుపత్రులు చెబుతున్నాయి. పరిమితి లేకుండా అప్పటికప్పుడు కేసులు వస్తుండడంతో బెడ్లకు, ఆక్సిజన్కు ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుందని,ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంత చొరవ తీసుకుంటే సమన్వయంతో పనిచేయవచ్చని మరో వైద్యాధికారి అభిప్రాయపడ్డారు.ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఉంటేనే వెళ్లాలని సూచించినా.. ఏపీలో ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తున్న అనుమతుల్లో వేగం పెంచకుండా సూచనలకే పరిమితం కావడం ఏంటనే విమర్శలూ మొదలయ్యాయి.స్థానికంగా ఆసుపత్రుల్లో చికిత్స అందడం లేదన్న ఉద్దేశంతోనే తాము హైదరాబాద్ కు వెళ్తున్నామని, అనుమతి ఉన్నా కొన్నిసార్లు అంబులెన్స్ లను వెళ్లనీయడం లేదని, దీనిపై ఏపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదనే అభిప్రాయాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు.తాము హైదరాబాద్లోని జీవన్ ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మ్ చేసుకున్నామని, తిరుపతి నుంచి వస్తున్నామని, అనుమతి ఉన్నా అంబులెన్స్లు ఆపివేశారని, పల్స్ పడిపోతున్నాయని ఓ బాధితురాలు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.సూర్యాపేట జిల్లా రామాపురం సరిహద్దు చెక్ పోస్టు వద్ద కూడా ఆంక్షలు అమలవుతున్నాయి.
ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
కాగా అంబులెన్స్లు అడ్డుకున్న ఘటనలపై ఇటీవలే తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. అంబులెన్స్లను అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్న విషయం తెలియదా అని ప్రశ్నించడంతో పాటు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.అంతర్జాతీయంగా కూడా పేషెంట్లు హైదరాబాద్కు వస్తారని, వారిని కూడా అడ్డుకుంటారా అని ప్రశ్నించింది.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తుంటే రావద్దని ఎలా చెబుతారని ప్రశ్నించింది. అనంతరం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ కేసును మే 17కి వాయిదా వేసింది.ఈలోగా మరోసారి అంబులెన్స్లు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంబంధిత ఆసుపత్రి ఇచ్చే లెటర్తో పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇచ్చిన పాస్ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు.











