భారత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతం అదానీ నుంచి వేల కోట్ల రూపాయల లంచం తీసుకుని… అదానీ గ్రూప్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు భారత్ లో వెలుగు చూసి ఉంటే… పరిస్థితి వేరేలా ఉండేది. అయితే ఈ కేసు అమెరికాలో నమోదైంది కాబట్టి… జగన్ కు పెద్దగా ఇబ్బంది ఉండదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అంతేకాకుండా… అమెరికాలో నమోదైన కేసులో అదానీనే ప్రధాన ముద్దాయిగా ఆ దేశ వ్యవస్థలు పేర్కొన్నాయి. ఎందుకంటే… ఏపీకి తాము భారీ మొత్తంలో విద్యుత్ ను అమ్ముతున్నామని, అందుకోసం విద్యుదుత్పత్తికి భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని చెప్పిన అదానీ… అమెరికా పెట్టుబడిదారుల నుంచి భారీగా పెట్టుబడులను రాబట్టారు. ఆ నిధులను విద్యుదుత్పత్తికి కాకుండా జగన్ సర్కారుకు లంచం ఇవ్వడానికి వినియోగించారన్నది అమెరికా వ్యవస్థల ప్రధాన ఆరోపణ. వెరసి తమ దేశ పెట్టుబడిదారులను అదానీ మోసం చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలతో పాటు ఆ దేశ కోర్టులు కూడా భావిస్తున్నాయి.
జగన్ కు అదానీ లంచాలు ఇచ్చిన వ్యవహారానికి సంబంధించి భారత్ లో పెద్దగా చర్చే జరగడం లేదు.ఎందుకంటే… ఈ కేసు నమోదైంది అమెరికాలో కాబట్టి. అయితే ఈ కేసుకు సంబంధించి సమగ్ర ఆధారాలు బయటకు వస్తే మాత్రం జగన్ కు కూడా ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసు ఎక్కడిదైనా… ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైన అదానీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి… అంతర్జాతీయ మీడియాకు దీనిపై ఆసక్తి అధికంగానే ఉంటుంది కదా. ఈ క్రమంలో రాయిటర్స్ సంస్థ ఈ కేసును మరింత లోతుగా పరిశీలించిందట. ఈపరిశోధనలో ఆ మీడియా సంస్థకు పలు కీలక ఆధారాలు లభించినట్లుగా సమాచారం. ఆ కీలక ఆధారాలతో సదరుమీడియా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న జగన్… అదానీ నుంచి రూ.1,750 కోట్లను ముడుపులుగా స్వీకరంచిన మాట వాస్తవమేనని సదరు కథనంలో ఆ సంస్థ కుండబద్దలు కొట్టేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు అదానీ అల్లుడు సాగర్ అదానీ ఫోన్ లో ఉన్నాయని కూడా రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది.
ఈ లెక్కన .జగన్ చెబుతున్నట్లుగా సెకీ ద్వారా అదానీ సంస్థల నుంచి ఏపీ సర్కారు తక్కువ ధరకేమీ విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోలేదని తేలిపోయినట్లే. ఎందుకంటే…తక్కువ ధరకు ఒప్పందం జరిగితే… అదానీ సంస్థల నుంచి జగన్ కు ముడుపులు ఎందుకు అందుతాయి? అంటే… మార్కెట్ లో ఉన్న రేటు కంటే కూడా ఎక్కువ ధర చెల్లించేందుకు జగన్ ఒప్పుకుంటేనే… ఆయనకు అదానీ సంస్థలు ముట్టజెప్పాయన్నమాట. ఇక అమెరికాలో తనకు అందుబాటులో ఉన్న ఆధారాలతో పాటుగా ఏపీలో తనకు లభించిన ఆధారాలను కూడా రాయిటర్స్ తన కథనంలో ప్రస్తావించింది. అదానీ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఏపీలోని దాదాపుగా అన్ని శాఖలు వ్యతిరేకంగా ఉన్నప్పటకీ… వాటన్నింటినీ పక్కనపెట్టేసిన జగన్… అదానీ సంస్థల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు అంగీకరించారట. ప్రభుత్వాధినేతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక… ఇక ఎన్ని శాఖలు వద్దంటే… ఆ ఒప్పందాలు ఆగుతాయి చెప్పండి. వెరసి అదానీ నుంచి లంచం తీసుకునే జగన్… అదానీ సంస్థల నుంచి ఏపీ విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరేలా చేశారని రాయిటర్స్ తేల్చి పారేసింది. ఈ వివరాలన్నీ బయటకు వస్తే… కేసు అమెరికాది అయినా ఇక్కడ జగన్ కు ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.











