రాజకీయ నేతలు సవాల్ విసురుకోవడం చాలా సర్వసాధారణం. అయితే ఒకరు సవాల్ విసిరితే మరొకరు మరో సవాల్ విసరుతుంటారు. కానీ ఒకరి సవాల్ ఒకరు స్వీకరించరు. ఇది రాజకీయాల్లో తరచూ చూస్తూనే ఉంటాం. కానీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్ను, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వీకరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భారీ అవినీతికి పాల్పడుతున్నాడని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ఎలాంటి అవినీతికి తావులేదని , కావాలంటే బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దమా అని సవాల్ విసిరారు. టీడీపీ పాలనలో నీవు అవినీతికి పాల్పడ్డావు అని ఒకరంటే, వైసీపీ అధికారంలోకి వచ్చాక దోచుకుతున్నావని మరొకరు సవాల్ విసురుకున్నారు. బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ఇవాళ మధ్యాహ్నం గం.2.30 ప్రమాణం చేయడానికి సిద్దం అయ్యారు. దీంతో అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. మొదట వీరి సత్యప్రమాణానికి పోలీసులు అంగీకరించలేదు. చివరకు ఏమైందో తెలియదు కానీ వారిని సత్యప్రమాణాలకు అంగీకరించారు. అయితే మందీమార్భలాన్ని , చివరకు మీడియాను కూడా దేవాలయంలోకి అనుమతించలేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి దంపతులు సత్యప్రమాణాలు పూర్తి చేశారు.
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సతీమణి ప్రమాణం చేయలేదంటూ..
కాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈ విషయంలో అసత్యాలు ప్రసారం చేయడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సతీమణి ప్రమాణం చేయలేదంటూ ఆ ఛానల్లో ప్రసారం చేశారు. దీంతో ఆమె ప్రమాణం చేసిన ఫోటోలను మాజీ ఎమ్మెల్యే ఆయన ఫేస్ బుక్లో ఫోస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా వదలకుండా దోచుకుతింటున్నాడని 12 అవినీతి అంశాలపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. నాటుసారా తయారీ, భూ కబ్జాలు, పామాయిల్ రైతుల సొమ్ము స్వాహా, చెరువుల అక్రమ తవ్వకాలు, పేకాట శిబిరాలు నిర్వహణ, రంగంపేటలో 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి సూర్యనారాయణ రెడ్డి రూ.400 కోట్లు దోచుకున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇక పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు కొనుగోలు చేసిన భూముల కొనుగోళ్లలో సూర్యనారాయణ రెడ్డి తీవ్రమైన అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై దమ్ముంటే ఎమ్మెల్యే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
సవాల్ స్వీకరించిన ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్ను ప్రస్తుత అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వీకరించారు. అయితే, చర్చకు విసిరిన సవాల్ను స్వీకరించకుండా సత్యప్రమాణాలు చేద్దామని మరో సవాల్ విసిరారు. ఎమ్మెల్యే విసిరిన సవాల్ను మాజీ ఎమ్మెల్యే కూడా స్వీకరించారు. ఇవాళ బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో మధ్యాహ్నం ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అనపర్తిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ముందుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కొంతసేపు గృహనిర్భందంలో ఉంచారు. తరువాత పోలీసు అధికారులు అనపర్తిలో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు నేతల దంపతులు, వారి తరపున ఒక్కొక్కరు ముగ్గురిని అనుమతించారు. మందీమార్భలంతో వస్తే అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరు నేతలూ దేవాలయానికి చేరుకున్నారు. చివరకు మీడియాను కూడా దేవాలయంలోనికి అనుమతించలేదు. ముందుగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లక్ష్మీగణపతి ఆలయంలోకి చేరుకున్నారు. కాసేపటికే ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యనారాయణ కూడా వచ్చారు. దీంతో ఇద్దరూ ఒకేసారి గణపతి విగ్రహంపై చేతులు పెట్టి సత్యప్రమాణ పత్రాలను చదివారు. దీంతో వీరి సవాల్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అవినీతిపై చర్చకు రావాల్సిందే..
అనపర్తిలో జరిగిన రూ.400 కోట్ల అవినీతిపై ఎమ్మెల్యే సూర్యానారాయణ రెడ్డి చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ హయాంలో దోచుకుతిన్నారని ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. కానీ చర్చకు మాత్రం రావడం లేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతల అవినీతిపై మరింత స్వరం పెంచారు. ఈ వ్యవహారం ఇంతటితో ముగిసేలా కనిపించడం లేదు. అనపర్తి వ్యవహారం వచ్చే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.