ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్న తరువాత నుంచి రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులు వరదలా వస్తున్నాయి. మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టుల పనులు ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రానికి కొత్తగా రానున్న ప్రాజెక్టుల్లో బుల్లెట్ ట్రెయిన్ ఒకటి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుకి కేంద్రం ఆమోదం తెలపగా.. 2027లో పనులు ప్రారంభం కానుండగా.. 2029లో ఏపీలో బుల్లెట్ రైల్ పరుగులు పెట్టనుంది.
దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ను కేంద్ర ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్కు నడపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు మార్గాల్లో ఈ హై స్పీడ్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో దక్షిణాదిలో రెండు మార్గాలు ఉన్నాయి. చెన్నై నుంచి బెంగళూరు మీదుగా మైసూరు వరకూ ఒక ట్రైన్, ముంబాయి నుంచి హైదరాబాద్కు మరో ట్రైన్ను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి దశ ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ లేదు. కాని తాజాగా ఏపీని కూడా ఇందులో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్రం అంగీకరించినట్టు చంద్రబాబు మీడియాకు తెలిపారు.
దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతి నగరాలు కలిసేలా బుల్లెట్ రైళ్లు నడపడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ వేయాల్సి ఉంటుందని, పూర్తి ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందని చంద్రబాబు తమ పార్టీ తరపున గెలిచిన ఎంపీలతో చెప్పారు. అమరావతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు నగరాలను కలిపేలా బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి భావన. ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో పంచుకున్నారు. దీనిపై కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని.. అనుకున్నట్లుగా అన్నీ ఒక కొలిక్కి వస్తే 2027లో పనులు ప్రారంభం కానున్నాయని చంద్రబాబునాయుడు వెల్లడించారు.
నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్లకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. వాస్తవానికి ఏపీలో బుల్లెట్ రైలు ప్రతిపాదన ఇప్పటికే ఉంది. చెన్నై-మైసూరు 435 కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్ లో భాగంగా బుల్లెట్ రైలు నడపాలని 2019లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఉండే హాల్టింగ్స్ లో ఏపీలోని చిత్తూరు కూడా ఉంది. అయితే తాను ప్రతిపాదించిన బుల్లెట్ రైలు కారిడార్ అమరావతిని ప్రధాన నగరాలకు అనుసంధానం చేస్తుందని.. దానివల్ల సంపద సృష్టి జరుగుతుందనేది చంద్రబాబు అభిప్రాయం.