తెలుగు తెరను ఇంతవరకూ అనేక ప్రేమకథలు ప్రభావితం చేశాయి. అలాంటి మరో ప్రేమకథ ఇప్పుడు యూత్ ను పలకరించడానికి సిద్ధమవుతోంది .. ఆ సినిమా పేరే ‘ఉప్పెన‘. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ద్వారానే, కథానాయికగా కృతి శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తోంది.
సముద్రతీర ప్రాంతంలోని ఒక గూడెం .. ఆ గూడాన్ని ‘రాయనం’ శాసిస్తుంటాడు .. ఆ సముద్రంపై ఆయనదే పెత్తనం. తన కూతురు ప్రేమను అంగీకరించని ‘రాయనం’ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడనే విషయం ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. కట్టుబాట్లకు .. పరువు ప్రతిష్ఠలకు ప్రాధాన్యతను ఇచ్చే ఓ గూడెం నేపథ్యంలో ఈ ప్రేమకథ నడుస్తుందనే విషయం స్పష్టమవుతోంది. తన కూతురు రూపంలో పెంచుకుంటూ వస్తున్న పరువును, ఎవరు చెదరగొడదామని చూసినా ప్రాణాలు తీసే రాయనం పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు అనిపిస్తోంది.
అలలు .. ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించకూడదు, కలిగినోడు .. కడుపు కాలేవాడు కలిసి నడవకూడదు అనేది రాయనం కాన్సెప్టు. అలాంటి ఆయన తన కూతురు ఒక అల్లరి కుర్రాడిని .. ఆకతాయిని .. సిన్సియర్ గా ప్రేమిస్తే ఎందుకు ఊరుకుంటాడు? కన్న కూతురు కోసం .. పరువు కోసం .. ఓ పేద ప్రేమికుడితో రాయనం చేసే యుద్ధమే ‘ఉప్పెన‘గా కనిపిస్తోంది. మరి ఈ ‘ఉప్పెన’ ప్రేమికులను ముంచేస్తుందా? ప్రేమను ఎదిరించిన పెద్దలను మింగేస్తుందా? అనేది చూడాలి. ఈ సినిమా తరువాత ‘రాయనం’ పాత్ర హాట్ టాపిక్ గా మారుతుందనే అభిప్రాయాలు మాత్రం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి.
Must Read ;- యంగ్ టైగర్ ఆవిష్కరించిన ‘ఉప్పెన’ మూవీ ట్రైలర్