(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం మాన్సాస్ వ్యవహారంలో వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. మాన్సాస్ ఛైర్పర్సన్ సంచైత గజపతికి మరో కీలక పదవి కట్టబెట్టింది. దీంతో అశోక్ గజపతి గతంలో ఎన్నడూ లేనంతగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంచైతకు మరో కీలక పదవి
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచైత గజపతిరాజుకు జగన్ ప్రభుత్వం మరో కీలక పదవి కట్ట బెట్టింది. తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు ఛైర్పర్సన్గా సంచైతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ బీవీఎస్ దుర్గాప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు గతంలో చైర్మన్గా సంచైత తండ్రి ఆనంద గజపతిరాజు వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చైర్మన్గా ఉన్నారు. అశోక్ గజపతిని జగన్ సర్కారు ఈ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచైతను ఛైర్పర్సన్గా నియమించాలని దేవాదాయ శాఖకు ప్రభుత్వం అక్టోబర్ 27న లేఖ రాసింది. దీంతో దేవాదాయశాఖ సంచైతను 104 ఆలయాలకు చైర్పర్సన్గా నియమించింది. రూ. 2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న 104 ఆలయాలకు సంచైత చైర్ పర్సన్గా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో సింహాచలం దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్గాను, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ బోర్డు ఛైర్పర్సన్ గాను ఆమెను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అశోక్ గజపతి కోర్టులో కేసు దాఖలు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో వేరొక పదవి అప్పగించడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read ;- అశోక్ గజపతికి అవమానం : పైడితల్లి పూజకు దూరం!
అశోక్ గజపతి ఆగ్రహం
తూర్పు గోదావరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థానంలో సంచైతను నియమించడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు అర్ధరాత్రి జీవోలకు నిదర్శనమని విమర్శించారు. దేవాదాయ భూముల లూటీకి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాన్సాస్ వైభవం కనుమరుగయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అశోక్ గజపతిరాజు విమర్శించారు.
Also Read ;- ఎమ్మార్ వేదికగా అక్కాచెళ్లెళ్లు ఢీ











