ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు ఇక జీవితం సెటిల్ అయినట్టే. అందుకే ప్రభుత్వ ఉద్యోగానికి అంత డిమాండ్. ప్రభుత్వం ఉద్యోగం పొందేందుకు ఏళ్ళకు ఏళ్ళు కష్టపడుతుంటారు యువకులు. నెల మొదటి రోజే జీతాలు, సమయానికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇలా అన్ని వాటంతట అవే వచ్చి పడుతుంటాయి. ఇది ఇంత వరకు ఉన్న అభిప్రాయం. అయితే, ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు వచ్చాం రా నాయనా అనుకుంటున్నారు కొందరు. జీతాలు టైముకు రావడం లేదు. డీఏల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక పీఆర్సీ బహూదూరం వెళ్ళిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ తీరు పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
5వ తారీఖు వరకు రాని జీతాలు..
ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడు నెలల నుండి మొదటి తేదీన జీతాలు పడటం లేదు. తెలంగాణలో ఉన్న జిల్లాల్లో వేరు వేరు తేదీల్లో వేతనాలు పడుతున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రెండు జిల్లాలకు ఒకరోజు చొప్పున జీతాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కాలంలో ప్రభుత్వం కోతలు పెట్టి జీతాలు వేసింది. లాక్ డౌన్ ముగిసిన తరువాత పూర్తి జీతాలు వేస్తున్నా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. నెల నెలకు జీతాలు ఇచ్చే తేదీ మారిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల క్రితం రెండో తారీఖున వచ్చిన వారికి నేడు 5వ తేదీన జీతాలు వస్తున్నాయంటున్నారు. దీంతో ఉద్యోగులు గందర గోళంలో పడిపోతున్నారు. తాము చెల్లించాల్సిన బిల్లులు, ఈఎంఐలు మొదటి తేదీనే కట్టాల్సి ఉంటుందని, వేతనాలు 5వ తేదీన పడుతుండటంతో ఈఎంఐలకు బ్యాంకులు అదనపు ఛార్జీలు వేస్తున్నాయంటున్నారు. వేతనాలు చెల్లించడంతో ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోందో అర్థంకావడం లేదని ఉద్యోగులు అంటున్నారు.
ఉద్యోగు సంఘాలు సమస్యలపై నోరు మెదపడం లేదు
తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తున్నారంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్న నేతలు తమ సమస్యలపై ఎందుకు నోరు మెదపడం లేదంటున్నారు. పైరవీల కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు వేచి చూసే నేతలు తమ జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయో ఎందుకు అడగడం లేదంటున్నారు. ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చిందే ఆలస్యం ప్రభుత్వ ఉద్యోగుల ఒక్కరోజు వేతనం విరాళం అంటూ చెప్పుకుని కోట్లాది రూపాయలు ఇచ్చే నేతలు వేతనాలు లేటవుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ వేతనాలు సాయం కింద ప్రకటించే ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదంటున్నారు. దీనిపై కింది స్థాయి ఉద్యోగుల్లో సంఘాల నేతల పట్ల అసహనం వ్యక్తమవుతోంది. అయినా ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం కనీస భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. కనీసం ఈ అంశాన్ని ఎత్తేందుకు కూడా ఇష్ట పడటం లేదు. దీంతో ఇక రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలను పక్కన ఉద్యోగులంతా ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. తమకు మొదటి తారీఖున వేతనాలు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.