న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సహకారంతో రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. 26 ప్యాకేజిలకు కేవలం 25 బిడ్లు రావడంతో ప్రభుత్వం ఆయా సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తూ జీవోలను విడుదల చేసింది. దీనిపై ప్రముఖ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించడంతో బాటు రుజువలతో సహ బయటపెట్టింది. కేవలం మూడు సంస్థలకే ఈ టెండర్లు దక్కాయని ఆ కథనాలలో రావడంతో జగన్ సర్కార్ యూ-టర్న్ తీసుకుంది. ఈ టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అసలు జరిగిందేంటి
ఎన్డీబీ నిబంధనల మేరకు బిడ్లను నమోదు చేసే సమయంలో ప్రైస్ బిడ్ల హార్డ్ కాపీ అందించాలని నిబంధన ఉండటం చిన్న, మధ్య కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆ నిబంధన కారణంగా బిడ్ వేసిన వారిని గుర్తించి టెండర్ల ప్రకియ నుంచి తప్పించేందుకు ఉపయోగపడిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నిబంధనలో కేంద్రం చేసిన మార్పులు, చేర్పులు గురించి చెప్పని కృష్ణబాబు వరల్డ్ బ్యాంకు నిబంధన అంటూ చెప్పడంపై అనుమానాలు రేకెత్తాయి. హార్డ్ కాపీ నిబందనలతో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లకు దూరమయ్యారు.
ఒక్క నిర్ణయం పలు అనుమానాలు
మీడియా కథనాలతోనే టెండర్లను రద్దు చేశామని కృష్ణబాబు చెప్పడంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంపై పత్రికలలో పలు కథనాలు వచ్చాయి. మరి అప్పుడు స్పందించని వైసీపీ ప్రభుత్వం ఈ టెండర్లలోనే రద్దు ఎందుకు చేసుకుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 26 ప్యాకేజిలకు కేవలం 25 బిడ్లు వస్తే మిగిలిన కాంట్రాక్టర్లు ఎందుకు టెండర్లు వేయలేదని ప్రభుత్వం ఆలోచన చేయవలసి ఉంది. కానీ అంతా అయిపోయిన తరువాత వారిలో భరోసా కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ఇంత పెద్ద వర్క్ కు ఇద్దరే టెండర్లు వేయడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కొందరు వైసీపీ ప్రభుత్వంలో టెండర్ వేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నారని కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం తమ వారికే ఈ పనులను ప్రభుత్వం అప్పగించింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ టెండర్లను ప్రభుత్వం రద్దు చేయడానికి కొన్ని పత్రికలు తమ ఘనతగానే చెప్పుకున్నాయి. ఈ అవకాశమిచ్చిన టెండర్ల విధానాన్ని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.
ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు వివరణ
టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తాము వివరించినప్పటికీ… అపోహలకు తావివ్వకూడదని సీఎం సూచించారని.. దాంతో టెండర్లు రద్దు చేశామని ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు వివరణ ఇచ్చారు. పత్రికలు అసత్య కథనాలు రాస్తున్నాయన్నది రీటెండర్ల ద్వారా ప్రజలకూ అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అందుకే రీటెండరింగ్ కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. వారంలోగా టెండర్లను పిలుస్తామని ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్లను సంప్రదిస్తామని వారిలో విశ్వాసాన్ని పెంచుతామని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు ఈ టెండర్లపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని కానీ పత్రికలే పనికట్టుకొని కథనాలు వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ టెండర్లలో ఎక్కువ మంది బిడ్లు వేయరని సీఎంకి తాము వివరించామని పేర్కొన్నారు. పారదర్శకత ఉండాలంటే ఈ టెండర్లను రద్దు చేయవలసిందే అంటూ సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు కృష్ణబాబు వెల్లడించారు. మీడియా చేసిన పనివల్ల న్యూ డెవలప్మెంట్ బ్యాంకు గడువులోగా ఈ టెండర్లను పూర్తి చేయలేకపోయామని అన్నారు. మరికొంత గడువు పెంచేందుకు కేంద్రంతో మాట్లాడి ఎన్డీబీని ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వంలో పత్రికలు చెబితే నిర్ణయాల సమీక్ష జరగటం మంచిదే అంటూ నిపుణులు చెబుతున్నారు. కేవలం ఈ సమీక్షలు రోడ్ల టెండర్ వరకూ మాత్రమే వర్తించకుండా అన్నీ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.











