రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15 శాతం ఇక పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనుంది. ఇకపై తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులకు ఈ నిర్ణయాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 2025-26 విద్యా సంవత్సరంలో స్థానికేతర కోటా 15% సీట్లనూ రాష్ట్ర విద్యార్థులే పొందనున్నారు. ఇప్పటి వరకు ఈ సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా..ఇక నుంచి ఈ సీట్లకు పోటీ పడటానికి తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఉండదు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి వర్సిటీల్లోని 15 శాతం కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఇక్కడి వర్సిటీల్లో తెలంగాణ వారికి అవకాశం లేకుండా ఆదేశాలు జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లు 70 శాతంలో 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయిస్తారు. స్థానికత ఏపీలో రెండు రీజియన్లుగా ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లుగా దీన్ని నిర్ణయిస్తారు. ఉమ్మడి ఏపీ, విభజన అనంతరం 10 ఏళ్ల పాటు ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్ల భర్తీ చేపట్టగా..ఇప్పుడు ఉస్మానియా రీజియన్ను తొలగించారు. ఇక నుంచి ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర రీజియన్ల వారీగా మాత్రమే సీట్లను భర్తీ చేయనున్నారు.
ఆంధ్ర రీజియన్ –
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్ర రీజియన్(ఏయూ) పరిధిలో ఉంటాయి. ఇక్కడి విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఏయూ రీజియన్కు లోకల్గా పరిగణిస్తారు. శ్రీ వెంకటేశ్వర రీజియన్ – ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు ఎస్వీయూ రీజియన్లో ఉంటాయి. ఈ జిల్లాల వారిని శ్రీవేంకటేశ్వర రీజియన్లో లోకల్గా పరిగణిస్తారు.
రాష్ట్ర విద్యా సంస్థలు..
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ, డాక్టర్ YSR ఆర్కిటెక్చర్, ఆర్జీయూకేటీ, క్లస్టర్ విశ్వవిద్యాలయంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల రాష్ట్ర విద్యా సంస్థలుగా ఉంటాయి. 85% స్థానిక కోటాలో ఆంధ్ర రీజియన్ వారికి 65.62%, SVU రీజియన్ వారికి 34.38% సీట్లు కేటాయిస్తారు. మిగతా 15% సీట్లను స్థానికేతర, జనరల్ కోటాలో భర్తీ చేస్తారు.
స్థానికేతర కోటా, జనరల్ కోటా 15% సీట్ల కేటాయింపునకు కొన్ని నిబంధనలు విధించారు. ఆంధ్ర వర్సిటీ రీజియన్ అభ్యర్థులు..శ్రీవేంకటేశ్వర రీజియన్లో 15% సీట్లకు పోటీ పడొచ్చు. అలాగే శ్రీవేంకటేశ్వర రీజియన్ విద్యార్థులు..ఆంధ్ర రీజియన్లో 15% స్థానికేతర సీట్లకు అర్హులవుతారు. ఉద్యోగ, ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా..ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో పదేళ్ల పాటు ఏపీలో నివసించిన వారై ఉంటే వారి పిల్లలు పోటీ పడొచ్చు. అభ్యర్థి ఏపీలో కనీసం 10 ఏళ్లు నివసించి ఉండాలి. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించిన తర్వాత పదేళ్లు ఏపీలో ఉండి ఉండాలి. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఈ సీట్లు పొందేందుకు అర్హులు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులు. అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి అర్హులు.
స్థానికత ఎలా నిర్ధారిస్తారంటే –
అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు గతంలో మాదిరిగానే రీజియన్ల వారీగా ఆరు నుంచి ఇంటర్మీడియట్ చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహారణకు బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ తదితర కోర్సులకు మొదట తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరసగా నాలుగేళ్ల చదువును చూస్తారు. 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు వరసగా నాలుగేళ్లు ఆయా రీజియన్లలో చదవకపోయినా.. ఏడేళ్లలో నాలుగేళ్లు చదివి ఉండాలి. ఏడేళ్ల కాలంలో ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా తీసుకుంటారు.ఒకవేళ స్థానిక ప్రాంతంలో ఏ విద్యా సంస్థల్లోనూ నాలుగేళ్లు చదవకపోయినా..అభ్యర్థి హాజరయ్యే అర్హత పరీక్షకు ముందు నాలుగేళ్లు ఏ ప్రాంతంలో నివాసం ఉంటే దాన్ని స్థానికతగా పరిగణిస్తారు. రెండు లేదా అంత కంటే ఎక్కువ ప్రాంతాల్లో చదివిన కాలం సమానంగా ఉంటే చివరిగా చదివిన ప్రాంతాన్ని స్థానికంగా తీసుకుంటారు. రాష్ట్రంలో ఏడేళ్లు ఏ విద్యాసంస్థల్లో చదవకపోయినా..అర్హత పరీక్ష రాయక ముందు నుంచి ఏడేళ్లు ఏపీలో నివసించి ఉంటే స్థానిక అభ్యర్థులుగా లెక్కిస్తారు. ఏపీలో ఈ ఏడేళ్లలో ఎక్కడైతే ఎక్కువ కాలం నివసించి ఉంటారో అక్కడ స్థానికులుగా పరిగణనలోకి వస్తారు.











