ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A-4, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్షాక్ తగిలింది. ఆయన అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో మిథున్రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని హైకోర్టు తేల్చిచెప్పింది. సేకరించిన ఆధారాలను మిథున్రెడ్డి ముందు ఉంచి ఎక్సైజ్ పాలసీ అమల్లో చోటుచేసుకున్న కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం విషయంలో సిట్ చేస్తున్న తీవ్ర ఆరోపణలను విస్మరించడానికి వీల్లేదని పేర్కొంది. ఈ కేసులో నేర తీవ్రత, లిక్కర్ సిండికేట్ కోసం రూ.3,500 కోట్ల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ పొందే అర్హత లేదంది హైకోర్టు.
ఇలాంటి కేసులో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇవ్వాలని..ఈ దశలో ముందస్తు బెయిలు మంజూరు చేస్తే విచారణకు అడ్డంకి కలుగుతుందని హైకోర్టు పేర్కొంది. ఆరోపణల విషయంలో సమగ్ర విచారణ జరిపేందుకు మిథున్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్ము మిథున్రెడ్డి కుటుంబసభ్యులకు చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు చేరిందని సిట్ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆ సొమ్ము మద్యం ముడుపులకు సంబంధించినది కాదని చెప్పేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలనూ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు పేర్కొంది.
ఈ కేసులో మిథున్రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు కోర్టు ముందు కనిపిస్తున్నాయని చెప్పింది. అలాంటప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి, పిటిషనర్కు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయన్న కారణంతో ముందస్తు బెయిలు మంజూరు చేయలేమంది. ఉద్దేశపూర్వకంగానే గతంలో ఉన్న మద్యం విధానంలో మార్పులు చేసి మద్యం తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసినట్లు ప్రాసిక్యూషన్ వాదిస్తోందని గుర్తుచేసింది. సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుంటే మద్యం విధానం రూపకల్పనకు సంబంధించిన నేరపూరిత కుట్రలో మిథున్రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని పేర్కొంది. ఈ కేసులో మిథున్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి, సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇటీవల తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి..బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించారు.











