ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఏపీకి రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం క్వాంటమ్ కంప్యూటర్తో రాబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు ఇప్పటికై ఫైనల్ అయ్యాయి. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య MOU కుదరనుంది. సంస్థతో తుదిదశ సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇప్పటికే IBM 156 క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొన్ని ప్రముఖ సంస్థలూ ఏపీకి క్యూ కట్టబోతున్నాయని అధికారులు చెబుతున్నారు.
IBM సంస్థ వన్ డెకో సిస్టమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుచేస్తే..దీనికి భిన్నమైన క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటుచేయనుంది. రెండు సంస్థలు వేర్వేరు టెక్నాలజీ కంప్యూటర్లను ఏర్పాటుచేస్తుండటంతో..ఎన్ని క్యూబిట్ల సామర్థ్యం ఉన్న కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే మరో భవనాన్ని నిర్మించాల్సి ఉంది. దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా? ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా? అనే దానిపై MOU కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ప్రధాన కేంద్రంలో 50 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటుచేసింది. దీన్ని విస్తృతపరిచే ఆలోచనలో సంస్థ ఉంది. మన రాష్ట్రం క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో..పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అమరావతిని ఎంచుకుంది మైక్రోసాఫ్ట్
దిగ్గజ సంస్థల రాకతో విదేశాలకు సేవలు ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తయారీ, ఎగుమతుల కోసం అమెరికాలోని ప్రధాన కేంద్రం తర్వాత హైదరాబాద్లో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. దీంతో హైదరాబాద్ స్థాయి బాగా పెరిగింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చ.అడుగుల్లో సదుపాయాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఐబీఎం సంస్థ, ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీల కోసం 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించనుంది.
క్వాంటమ్ కంప్యూటింగ్లో అనేక సాంకేతికతలు ఉన్నాయి. దీన్ని విస్తృతపరిచేందుకు గూగుల్, అమెజాన్, అయాన్క్యూ, రిగెట్టి కంప్యూటింగ్, క్వాంటిన్యూమ్ లాంటి సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దృష్ట్యా ఒక్క ఐబీఎం సంస్థతోనే ముందుకెళ్తే..అది ఎంతమేరకు విజయవంతం అవుతుందనే సందిగ్ధత అధికారుల్లో ఉంది. ఉదాహరణకు నోకియా.. శామ్సంగ్.. యాపిల్.. బ్లాక్బెర్రీ పేరుతో సెల్ఫోన్లు గతంలో వచ్చాయి. అందులో శామ్సంగ్..యాపిల్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్ టెక్నాలజీల్లో.. ఏది ఎక్కువగా ప్రపంచమార్కెట్ను ఆకర్షిస్తుందో ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టం. ఈ దృష్ట్యా వివిధ సంస్థలను అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకువచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు అధికారులు.











