కర్ణాటక ఏరోస్పేస్ పరిశ్రమలను ఏపీకి ఆహ్వానించారు మంత్రి నారా లోకేశ్. ఏరో స్పేస్ సంస్థలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏరోస్పేస్ పరిశ్రమల కోసం తన దగ్గర మంచి ఐడియా ఉందన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఏరో స్పేస్ పరిశ్రమలను ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వం దగ్గర ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ రెడీగా ఉందని చెప్పారు. అత్యుత్తమ స్థాయిలో ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామన్నారు. బెంగళూరుకు సమీపంలోనే వెంటనే కేటాయించేందుకు సిద్ధంగా 8,000 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే కలసి మాట్లాడుకుందామంటూ ఆ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు.
ఇంతకీ ఏం జరిగింది?
కర్ణాటక ప్రభుత్వం కెంపెగౌడ ఎయిర్పోర్టు సమీపంలోని దేవనహల్లి తాలుకాలో ఏరో స్పేస్ పార్కు ఏర్పాటు కోసం 1777 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించాలనుకుంది. ఐతే రైతుల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సిద్ధరామయ్య సర్కార్ వెనక్కి తీసుకుంది. తాజాగా విధానసౌధలో అక్కడి రైతులతో సమావేశమైన సిద్ధరామయ్య..ఏరోస్పేస్ పార్కు ఏర్పాటుపై వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మనీ కంట్రోల్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది.
మనీ కంట్రోల్ కథనాన్ని తన ట్విట్టర్లో పోస్టు చేసిన లోకేష్..ఏపీలో అద్భుతమైన ఏరో స్పేస్ పాలసీ రెడీగా ఉందని, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఏరోస్పేస్ సంస్థలకు పిలుపునిచ్చారు. బెంగళూరుకు అత్యంత సమీపంలోనే 8 వేల ఎకరాల భూమి రెడీగా ఉందన్నారు. ఐతే లోకేష్ ఆహ్వానంపై ఏరో స్పేస్ సంస్థలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది. బెంగళూరుకు అత్యంత సమీపంలోనే ఈ భూములు ఉండడంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.











