మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాల్లో దోపిడీదారులకు చోటు లేదని ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు తేల్చిచెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం ట్రస్ట్ చైర్మన్ గా కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ… తనను పదవి నుంచి తప్పించిన జగన్ సర్కారుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ట్రస్ట్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటిదాకా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.
డబ్బులు తీసుకుని ఆడిట్ చేయరా?
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు ఏమన్నారన్న విషయానికి వస్తే… మాన్సాస్లో ఆడిట్ జరగలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని, ఇందుకోసం ఏటా సంస్థ ఫీజు కూడా అధికారికంగా చెల్లించిందని తెలిపారు. దోపిడీదారులకు మాన్సాస్లో స్థానం లేదన్నారు. మాన్సాస్ ఛైర్మన్గా విద్యకే తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అలాగే, విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని తెలిపారు. రామతీర్థంలో రాముడి ప్రతిమపై దాడి చేసి దుండగులు స్వామివారి శిరస్సును తీసుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విరాళాన్నీ తిరస్కరించారు
రామతీర్థం విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించినప్పుడు ఆ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని చెప్పారు. తాను ఆ ఆలయానికి విరాళం ఇచ్చినా తిరస్కరించడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. దీంతో ఆ విరాళం అయోధ్య రామాలయానికి ఇచ్చానని చెప్పారు. అంతేగాక, సింహాచలం దేవస్థానం ఈవో కూడా తనను కలవడానికి ఇష్టపడలేదని తెలిపారు. మొత్తంగా జగన్ సర్కారు తీసుకున్న చీకటి జీవో నేపథ్యంలో చోటుచేసుకున్న విషయాలపై అశోక్ గజపతి రాజు మరోమారు గుర్తు చేయడంతో పాటుగా ఇకపై ఈ తరహా వ్యవహారాలకు చెక్ పెట్టడం ఖాయమని ప్రకటించారు.