వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత అహంకారపూరితంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ‘ప్రజలకు మంచి’ అనిపించేది తాము చేయాలి అని పాలకులు కోరుకుంటే తప్పులేదు. కానీ ‘‘తాము మాత్రమే చేయాలి. మరెవ్వరూ ప్రజలకు మంచి చేయడానికి వీల్లేదు.. అలా ఎవరైనా ప్రజలకు మంచి చేస్తే అది నేరం’’ అని భావిస్తే ఆ వైఖరిని ఏం అనుకోవాలి? పైగా, తమను ధిక్కరించిన వారు, తమ అసమర్థతను ప్రపంచానికి చాటిచెప్పిన వారు.. అలాంటి పనిచేస్తే ఆ రీతిగా తమ చేతకానితనం మరింత బయటపడుతుందని తెలిస్తే.. వారు ఇంకెంతగా రెచ్చిపోతారు..? అనడానికి ఇది ఉదాహరణ! లేని నిబంధనల్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ప్రజల సంక్షేమం కోసం కాకుండా, తమ స్వార్థం, అహంకారం కోసం ఎంతగా రెచ్చిపోతున్నారో చెప్పే సంఘటన ఇది!
వివరాల్లోకి వెళితే..
చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. కృష్ణపట్నం ఆనందయ్య మందును విరివిగా ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. నియోజకవర్గంలోనే ఆనందయ్య మందును స్థానికంగా తయారు చేయిస్తున్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉచితంగా పంచుతానని కూడా ప్రకటించారు. అంతవరకు ఆయనను కూడా అభినందించాల్సిందే. అయితే ఇదే నియోజకవర్గంలోని పుదిపట్ల పంచాయతీలో సర్పంచి బడి సుధాయాదవ్ కూడా తమ గ్రామంలో ప్రజలందరికీ ఆనందయ్య మందు పంచిపెట్టదలచుకున్నారు. నేరుగా కృష్ణపట్నం నుంచే మందు తీసుకువచ్చి.. గ్రామంలో పంచిపెట్టారు. అయితే.. హఠాత్తుగా పోలీసులు సుధాయాదవ్ను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మందు పంచకూడదంటూ అడ్డుకున్నారు. తన గ్రామంలోని ప్రజల ఆరోగ్యం కోసం తాను మందు పంచి తీరాల్సిందేనని సుధాయాదవ్ పట్టుబట్టడంతో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది.
Also Read ;- ప్రభుత్వం సాయం చేస్తే రోజూ పది లక్షల మందికి మందిస్తా : ఆనందయ్య

సుధాయాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచి..
దీని వెనుక ట్విస్టు ఏంటంటే.. బండి సుధాయాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచి. పార్టీ టికెట్ రాకపోయే సరికి తిరుగుబాటు చేసి ఇండిపెండెంటుగా గెలిచారు. బహుశా అందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈగో హర్ట్ అయిఉండొచ్చు. ఇప్పుడు.. తాను నియోజకవర్గం అంతా పంచదలచుకుంటే.. ఆ పంచాయతీలో తన ప్రమేయం లేకుండా పంపిణీ జరగడం ఆయనకు కంటగింపు అయి ఉండొచ్చు. ఆయన పురమాయింపు మేరకే పోలీసులు అడ్డుకుని ఉండొచ్చు అనే అభిప్రాయాలు ప్రజలకు కలుగుతున్నాయి.
పోలీసులు అడ్డుకోవడం ద్వారా..
అయితే ఇలాంటి అడ్డుకునే పని ద్వారా పోలీసులు ఎలాంటి సంకేతం ఇవ్వదలచుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు బతకాలంటే కూడా, వాళ్ల ఆరోగ్యం కోసం ఎవరైనా వితరణ శీలులు ఏదైనా మంచి పని చేయాలంటే కూడా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనా? అనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం కోసం మందు పంచడానికి ఇవాళ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంటున్న పోలీసులు.. రేపు మందు తినాలంటే కూడా ప్రజలందరూ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందేనంటూ కొత్త వేషాలు మొదలెడితే ఆశ్చర్యం ఏముందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇవాళ ఒక సర్పంచి గ్రామంలో మందు పంచడానికి ప్రభుత్వ అనుమతి లేదని అడ్డుకుంటున్న వాళ్లు.. రేపు ఎవరైనా అన్నదానం లాంటి వితరణ పనులు చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం అనుమతి, జగన్ ఫోటో ఉండాల్సిందేనని పట్టుబట్టినా ఆశ్చర్యం ఏముందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
Must Read ;- అంతా వాళ్లిష్టం.. ఆనందయ్య మందు వారికే సొంతం!











