(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న లొల్లి మళ్లీ మొదటికి వచ్చింది. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మధ్య చోటు చేసుకున్న ఆధిపత్యపోరు మరోసారి తెర మీదకి వచ్చింది. సమిసిపోయింది అనుకున్న వివాదం మళ్ళీ మొదటికి చేరడంతో ప్రస్తుతం విజయనగరం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీలో అన్ని సర్దుకున్నాయి అని టీడీపీ కార్యకర్తలు ఆనందపడుతున్న వేళ తిరిగి కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. జిల్లా టీడీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య పంచాయితీ పెరిగిపోతోంది. జిల్లా టీడీపీలో గత వారం రోజుల క్రితం పార్టీ అధిష్టానం ఆదేశాలతో తన కార్యాలయం పై ఉన్న టీడీపీ బోర్డు తొలగించిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి ఇప్పుడు తిరిగి బోర్డు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఇకపై ఇదే పార్టీ కార్యాలయం అంటూ తన అనుచరులకు, కార్యకర్తలకు చెప్పారు.

పెద్దరికంగా ఉండాలి
పెద్దలు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు పెద్దరికంగా ఉండాలి కానీ ఒడ్డెక్కిన ఓడ మల్లన్న సామెతలా ఉండకూడదని పరోక్షంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నకు చురక అంటించారు. పార్టీనే నమ్ముకొని, పార్టీని ముందుకు నడిపించే టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒక గూడు లేదని, ఇకపై కుదరదని, పార్టీ కోసం కార్యాలయం నడుపుతానని పరోక్షంగా అధిష్టానంకు సవాలు విసిరారు. కార్యకర్తల కోసం తాను పెట్టిన పార్టీ కార్యాలయం తీసివేయాలని, వారం రోజులలో తామే ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ మేరకు మాత్రమే తాను గతంలో తాత్కాలికంగా కార్యాలయం బోర్డు తీశానని చెప్పారు. కానీ పార్టీ పెద్దలు మాత్రం ఇచ్చిన హామీ నెరవేర్చకుండా నూతన కార్యాలయం ఏర్పాటుపై నిర్లక్ష్యం చేస్తూ తనను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు మీసాల గీత. పార్టీ కార్యకర్తల కోసం కార్యాలయం అశోక్ బంగ్లా నుండి తొలగించి బయటపెట్టేందుకు పార్టీ హెడ్ క్వార్టర్స్ నుండి గైడ్ లైన్స్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు తమ మాట నిలబెట్టుకోనందున చేసేదేమిలేక తిరిగి కార్యాలయం బోర్డు పెట్టి, కార్యాలయం ప్రారంభించానని మీసాల గీత చెప్పారు.
జిల్లాలో హాట్ టాపిక్
తెలుగుదేశం కార్యాలయం విషయంపై నిర్ణయం తాము తీసుకుంటామని, కార్యాలయం బోర్డు తీసేయమని ఆదేశించినప్పటికి తిరిగి కార్యాలయం బోర్డు పెట్టి పార్టీ కార్యాలయం నిర్వహించటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధిష్టానం ఆదేశాలను ధిక్కరించటంతో పాటు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని మీసాల గీత చెప్పటం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీసాల గీత అధిష్టానం పట్ల వినిపిస్తున్న ధిక్కార స్వరమే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ కేడర్లో ఉత్కంఠ
విజయనగరం జిల్లా టీడీపీ వ్యవహారాల్లో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పినట్టే ఇంతవరకు సాగుతోంది. కొంత కాలంగా అశోక్.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మధ్య కొనసాగుతున్న విబేధాలు ముదిరినట్లు ఈ పరిణామాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాల పట్ల ఇటు అశోక్ గజపతిరాజు, అటు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని జిల్లా టీడీపీ క్యాడర్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు
Also Read: అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!











