(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నందున పూసపాటి అశోక్ గజపతిరాజు పార్టీ మారేందుకు యోచిస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనే స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి విలువలే ప్రాణంగా జీవిస్తున్నానని, ప్రాణం పోయినా పార్టీ మారనని స్పష్టం చేశారు.
‘తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను. నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను. నేను ఈ మధ్య ప్రధానిని కలిశానని, పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు వాస్తవం కాదు’ అని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని 104 దేవాలయాలకు సంచైత గజపతిని ఛైర్ పర్సన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం చీకటి జీవోలు తెస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిబంధనలనూ పాటించకుండా చీకటి జీవోలు తెస్తోందని అశోక్ గజపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి దేవాలయాల ఆస్తులపై కన్ను పడిందని ఆరోపించారు. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిపై ప్రజలు స్పందించాల్సిన అవసరముందన్నారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రోజున జరిగిన సంఘటన బాధాకరం అన్నారు. కోట బురుజుపై తన కుటుంబ సభ్యులతో పాటు అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూర్చునే వారని తెలిపారు. జరిగిన పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Also Read ;- చారిత్రక కళాశాల ప్రైవేటీకరణ! : మాన్సాస్లో మరో అలజడి
దేవాలయాల ఆదాయం మా సొత్తు కాదు
మాన్సాస్ పరిధిలోని ఆలయాల్లో వచ్చే ఆదాయం తమ సొత్తు కాదని, అది దేవాలయాలదేనని అశోకగజపతి రాజు స్పష్టం చేశారు. దేవాలయాలకు వచ్చే ఆదాయంలో ఒక్క పైసా తాము ముట్టుకోలేదన్నారు. తాను ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టేనాటికి 37 దేవాలయాలలో దూప దీప నైవేద్యాలు జరిగేవికాదని తెలిపారు. తాను ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పునప్రారంభించానన్నారు.
అశోక్ గజపతి రాజు పార్టీ మారుతున్నారని కొన్నాళ్ళుగా షికారు చేస్తున్న పుకార్లకు ఇంతటితో తెరపడుతుందో లేదో చూడాలి.
Also Read ;- మాన్సాస్తో అశోక వైభవం గతించినట్టేనా?











