టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించడం దాదాపు ఖరారైంది. పలువురు టీడీపీ సీనియర్ నాయకులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి. బీసీ నేత, వెనుక బడిన ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి వచ్చిన నాయకుడు కావడంతో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందంటూ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో చంద్రబాబు తమ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
హైకోర్టు బెయిల్ మంజారు చేయడంతో ఇటీవలే అచ్చెన్న జైలు నుంచి బయటికి వచ్చారు. వచ్చి రాగానే ప్రభుత్వ తీరును ఎండగడుతూ ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పయితే! ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే వుంటాను. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. సత్యం నా ఆయుధం. ప్రజాక్షేమమే నా లక్ష్యం’ అంటూ ఆయన చేసిన ట్వీట్ టీడీపీ శ్రేణులలో జోష్ నింపింది. కష్ట కాలంలో కూడా పార్టీకి నిబద్దతగా ఉంటూ సమర్థత చూపే నాయకులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అచ్చెన్నకు అధ్యక్ష పదవిని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2019లో జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన టీడీపీని చంద్రబాబు నియోజకవర్గాల వారీగా ప్రక్షాళన చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో మండల స్థాయి కమిటీలను నియమించారు. ప్రస్తుతం లోకసభ కమిటీలను నియమించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాగానే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించి అచ్చెన్నకు ఆ బాధ్యతలు అప్పగించనుందని సమాచారం. ఈ నెల మూడో వారంలో అచ్చెన్న ఈ పదవిని చేపట్టడం ఖాయమంటూ టీడీపీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది.