వరుస వివాదాలతో వివాదాస్పదం అవుతోన్న తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన ఆడియో మరొకటి వైరల్ గా మారింది. అవసరాలకు మనల్ని వాడుకుని కీలక నిర్ణయాల్లో కనీసం భాగస్వాములను కూడా చేయడం లేదని ఆ ఆడియోలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వాపోయారు. అధికారం కోసం మన ఎస్సీలను అడ్డంపెట్టుకుని, ఎన్నికల్లో గెలిచాక అంతా ఒక రెడ్డీసే చక్రం తిప్పుతున్నారంటూ లీకయిన ఆడియోలో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
మనల్ని కుక్కలా వాడుకున్నారు
మనల్ని అణగదొక్కాలని మనసులో పెట్టుకుని పైకి మాత్రం ఎంతో ప్రేమాభిమానాలు ఒలకబోస్తున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడినట్టుగా లీకయిన ఆడియో వైసీపీ వర్గాలను ఆలోచనలో పడేసింది. మనల్ని కుక్కల్లా వాడుకుని ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమేనని ఆడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాడికొండ లో ఒక సందర్భంలో జోగి రమేష్ మనల్ని పొగిడితే, గుంటూరు నుంచి వచ్చిన అప్పిరెడ్డి మాత్రం మనపైనే విమర్శలు చేస్తున్నాడని శ్రీదేవి ఆ ఆడియోలో వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు మాత్రమే మనం స్టేజీలపై ఉంటున్నాం. తరవాత మనతో వారికి పనిలేదు. మనపార్టీకి చెందిన ఎంపీ ఒకరు పార్లమెంటుకు వెళ్లడు. ప్రచారం పిచ్చి ఎక్కువ. ఒక్కసారి ఓడిస్తే విషయం అర్థం అవుతుందంటూ శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై సీఎంఓ ఆరాతీస్తున్నట్టు సమాచారం.
మొదటి నుంచి వివాదాలకు కేంద్రం
మొదటి నుంచి తాడికొండ ఎమ్మెల్యే వివాదాలకు కేంద్రంగా మారుతూనే ఉన్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో , శ్రీదేవి వర్గానికి ఇసుక రీచ్ ల వ్యవహారంలో బెడిసికొట్టింది. దీంతో వారి పంచాయితీ సీఎం వద్దకు చేరింది. సీఎం చొరవతో ఇద్దరూ ఎవరి పనివారు చేసుకుపోతున్నట్టు కనిపిస్తున్నా, ఒకరిపై ఒకరు అవకాశం దొరికినప్పుడల్లా వివాదాల్లో ఇరికించడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం. తాజాగా లీక్ అయిన ఆడియోను కూడా ఎమ్మెల్యే శ్రీదేవి ప్రత్యర్థి వర్గాలు రిలీజ్ చేసి వైరల్ చేశాయనే అనుమానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఉండవల్లి శ్రీదేవికి ఎలాగైనా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా చూడాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయని శ్రీదేవి వర్గం అనుమానిస్తోంది.