(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను గ్రేటర్ నగరాలుగా మార్చాలని వైసీపీ భావిస్తోంది. ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయంగా టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 26 కు (రెండు గిరిజన జిల్లాలు) పెంచుతామన్న వైసీపీ వర్గాలు తర్వాత వీటి సంఖ్యను 32కు పెంచుతున్నట్టు మీడియాకు లీక్ చేశాయి. అదే సమయంలో కొన్ని నగరాలను(నియోజకవర్గాలను) గ్రేటర్ ప్రాధాన్యంలో ఉంచుతున్నట్టు కూడా చెబుతున్నాయి. వీటిలో కీలకమైన అనంతపురం జిల్లాలోని హిందూపురం, విజయనగరంలోని విజయనగరం, గుంటూరులోని అమరావతి, నరసరావుపేట, కృష్ణాలో విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు జిల్లాలోని ఆదోని, ఏలూరులో ఏలూరు నియోజకవర్గాలను గ్రేటర్ నగరాలుగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీటి వెనుక టీడీపీ ఓటు బ్యాంకును వైసీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలే తిరుపతిని గ్రేటర్గా ప్రతిపాదించారు. దీనికి తగిన హంగులు అద్దుతున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో గ్రేటర్ నగరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గ్రేటర్తో పాగా ..
గ్రేటర్ నగరాలుగా ఏర్పాటు చేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకును పరిశీలిస్తే టీడీపీకి అనుకూల పరిణామాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో గతంలో వరుస విజయాలు కైవసం చేసుకుని టీడీపీ దూసుకుపోయింది. కేవలం గత ఎన్నికల్లోనే టీడీపీ పరాజయం పాలైనా.. ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగానే ఉంది. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు గెలుపు గుర్రాలు ఎక్కినా, తక్కువ మెజారిటీతోనే విజయం సాధించారు. ఈ క్రమంలోనే వైసీపీ పాగా వేసేందుకు అనూహ్యంగా గ్రేటర్ అంశాన్ని వినియోగించుకునేలా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ప్రజలు మొగ్గు చూపుతారనే ..
గ్రేటర్ నగరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రియల్ బూమ్ పెరగడంతో పాటు మౌలిక సదుపాయాలు, రహదారుల విస్తరణకు మరింత అవకాశం ఉంటుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారనే వ్యూహంతోనే వైసీపీ గ్రేటర్ ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా చంద్రబాబు వైసీపీ వ్యూహాన్ని ఎలా ఎదుర్కొంటారు? నిజంగానే ఓటు బ్యాంకు మారిపోతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.