ప్రజలకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ప్రతిపక్షంలో ఉండగా చిలక పలుకులు పలికి ప్రజల్ని నమ్మించిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు వారి నడ్డి విరుస్తున్నారు. పరిమితి లేకుండా కరెంటు ధర పెంచుకుంటూ పోతూ జనాల్ని పట్టి పీడిస్తున్నారు. తాజాగా మరోసారి కరెంటు ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత వల్ల ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొని సరఫరా చేస్తోంది. ప్రణాళికా లేమితో వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆ భారాన్ని కూడా ప్రజలపై మోపడానికి రెడీ అయింది. ఇప్పటికే ఆకాశాన్ని తాకేలా వస్తు్న్న కరెంటు బిల్లులకు తోడు.. మరింత అదనపు ఛార్జీ జత చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
కరెంటు కొనుగోలు భారాన్ని తట్టుకోలేక ప్రజలపైనే ఆ భారం పడేయాలనే ఉద్దేశంతో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటికే ఒక బిల్లులో మూడు రకాల అదనపు ఛార్జీలను ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాజాగా అదనంగా రాష్ట్ర ప్రజల నుంచి రూ.7,200 కోట్లు వసూలు చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు డిస్కమ్లు ప్రతిపాదనలు పంపాయి. వాటిపై ప్రజాభిప్రాయసేకరణ చేయడానికి ఓ ప్రకటన కూడా జారీ అయింది.
కరెంటు బిల్లులో భాగంగా ఏపీ ప్రజలు కడుతున్న అదనపు ఛార్జీలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే ఓ ట్రూ అప్, రెండు ఇంధన సర్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతించిన దాని కంటే అదనంగా విద్యుత్ కొనడం వల్ల ఈ ఖర్చును వసూలు చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు అయిన ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి రూ.2,800 కోట్లు, ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రూ.2,500 కోట్లు, ఛత్తీస్గఢ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రూ.1,900 కోట్లు చొప్పున ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని.. విశ్లేషించిన తర్వాత ఎంత భారం వేయాలనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించనుంది. దీనికోసమే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 1.91 కోట్ల మంది కరెంటు వినియోగదారులు ఉన్నారు. తాజా నోటిఫికేషన్ తో వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం వెనకాడడం లేదు. డిస్కమ్లు రెండు ట్రూఅప్ల రూపంలో రూ.5,993 కోట్లను వసూలు చేస్తున్నాయి. వాడిన విద్యుత్తో పాటు అదనంగా ట్రూ అప్లు, ఇంధన సర్దుబాటు ఛార్జీలకే వినియోగదారులు.. తమ మొత్తం కరెంటు బిల్లులో 40 శాతం అదనంగా బిల్లు కడుతున్నారు. రాష్ట్రీయంగా విద్యుత్ ఉత్పత్తి పెంచకుండా.. బయటి నుంచి అధిక ధరలకు కొంటుండడం వల్లే ఈ అదనపు భారం పడుతోంది. ప్రభుత్వ చేతగానితనంతో కరెంటీ ఛార్జీలు రాన్రానూ ఆకాశానికి ఎగబాకుతూనే ఉన్నాయి.











