చేతిలో చిడతలు… తలకి పాగా… మెడలో తువ్వాలు,… విశాఖపట్నం అంతా సైకిల్ మీద తిరుగుతుంది ఓ పాట.
పాట తానొక్కడే వెళ్లడం కాదు… మనల్ని తనతో రమ్మంటుంది. ఎక్కడికంటారా… పొలాల్లోకి, కర్మాగారాల్లోకి, జనంలోకి, స్వచ్ఛమైన నవ్వులున్న అడవుల్లోకి ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ కన్ను గీటుతుంది. అలా తనతో వచ్చావనుకో…. బాబోరే… ఓ మంచి జీవితం ఉంటదిరా అని ఊరిస్తుంది. మంచి జీవితం ఎలా ఉంటోదో యంత్రమెట్లా నడుస్తుందో చెప్పినంత హాయిగా చెబుతుంది. ఇంతకీ ఆ పాట పేరు ఏమిటనుకుంటున్నారా… తల్లిదండ్రులు పెట్టింది ప్రసాదరావు. తెలుగోళ్లం కదా… ఇంటి పేరు కూడా కావాలి కదా… అందుకని అది వంగపండు అంటుంది. మొత్తమ్మీద ఆ పాట పేరు వంగపండు ప్రసాదరావు అని చెబుతుంది. ‘‘ఏటి ఇలాగొచ్చావేటీ’’ అని అడిగితే.. ‘‘ అబ్బే ఏటినేదు. పాటలు కట్టాం కదా…అయి పాడాలి కదా…. జనం ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి కదా’’ అని అంటుంది. అనడమే కాదు… రోడ్డు మీద నాట్యం చేస్తూ పాటందుకుంటుంది వంగపండు ప్రసాదరావు. ‘‘విప్లవం కోసం అడవుల్లో యుద్ధాలు చేసే వాళ్ల పక్షం ఉండాలెస్’’ అని తన సిద్ధాంతాన్ని ఎలాంటి రాద్దాంతం లేకుండా ప్రకటించేస్తుంది. అసలు వంగపండు రైతు కదా… ఈ పాటలు అయి ఎలా వచ్చేయి అని ఆయన్నే అడిగితే ‘‘ ఓస్. ఏటుంది. మా నాన్న పాడేవోడు. తాత పాడే వోడు. మాయమ్మ పాడేది. విప్పుడు నాను పాడుతున్నాను కదేటి’’ అని ఓ నవ్వు నవ్వుతూ పాట సమాధానం చెబుతుంది.
యంత్రమెట్ల నడుత్తు ఉందంటే అని దాని తయారు చేసిన వాడిని అగితే వాడేదేదో చెప్తాడు… అదే వంగపండుని అడిగితే… ‘‘యంత్రమెట్లా నడుత్తు ఉందంటే.. మిల్లు, మిసను, మోటరు సైకిలు… పెట్రోలుతో కాదు… మా రగతంతో నడుస్తుంది’’ అంటాడు వంగపండు. ‘‘జజ్జనకరి.. జనారే.. జనకు జనా జనారే’’ ఈ పాట పుట్టి దాదాపు ఐదు దశాబ్దాలు అయ్యింది. ఈ పాటను పుట్టించిన వంగపండు ప్రసాదరావు పుట్టి దగ్గరదగ్గర ఏడున్నర దశాబ్దాలు. అంటే తన 25 ఏట వంగపండు జజ్జనకరి జనారే అనే పాటకి పురుడు పోశారన్న మాట. అన్న మాట కాదెస్. ఉన్న మాటే. జానపదంలో ఆధ్యాత్మికతకు జన్మనిచ్చింది అన్నమయ్య అయితే జానపదంలో విప్లవానికి జన్మనిచ్చింది మాత్ర వంగపండు. అంతకు ముందు సుబ్బారావు పాణిగ్రాహి వంటి వారు జముకుల కథతో ప్రఖ్యాతులు అయినా.. జానపదంతో విప్లవాన్ని ముట్టించింది మాత్రం వంగపండు ప్రసాద రావే. ఓపాలి ‘‘ఈ పాటలేటి. విప్లవం. ప్రజలు… అంటూ. హాయిగా సినిమాలకు రాయచ్చు కదా… నాలుగు డబ్బులొస్తాయి’’ అంటే ‘‘రాయచ్చు. పాడై పోవచ్చు. ప్రజల నుంచి దూరం అయిపోయి ఇనపెట్టెను కప్పుకుని బతికేయచ్చు’’ అన్నాడు వంగపండు.
పాట రాయడమంటే వెండితెర మీద ఇరగపోవడం కాదు అని కూడా చెప్పాడు. పాట రాయడమంటే వీరో వీరోయిన్ ల టెప్పులకో… సంగీత దర్శకుడి బాణిలకో రాయడం కాదు అనీ చెప్పాడు వంగపండు. ఇంకా చాలాచాలా చెప్పాడా పెద్ద మనిషి. అంతే కాదు..పాట రాయడమంటే ప్రజలతో కలిసి నడవడం అన్నాడు. పాట రాయడమంటే నిరుపేదలతో కలిసి భోజనం చేయడం అన్నాడు వంగపండు. పాట రాయడమంటే సచ్చిపోయనా బతికుండడడం అన్నాడు వంగపండు. ఎలా గంటారా… ఇదిగో ఇలాగే… తెలుగు రాష్ట్రాలకే కాదు.. మొత్తం ప్రపంచంలోని తెలుగు వారంతా నాలుగు రోజుల నుంచి ముసురు పట్టిన మనసుల్లా దిగాలుగా ఉన్నారు. వంగపండు పుట్టిన పార్వతీపురమే కాదు…చిత్తూరు… అదిలాబాద్, బెంగళారు, ముంబాయ్, అమెరికా, దుబాయ్ ఇలా అన్ని చోట్లా వివిధ ఉన్న తెలుగు వారు కంటి నుంచి రెండు కన్నీటి బొట్లు రాల్చడం. పాటని మిగిల్చి వెళ్లిపోయిన వంగపండు… పాటకి పర్యాయపదం.. పాటకి చెకుముకి రాయి… పాటకి ప్రాణం. లెగు లెగు లెగవయ్యా కోడి కూసెను మావయ్యా అని పాడితే వంగపండు లేస్తాడేమోనని ఓ ఆశ. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అని పిలిస్తే వస్తాడేమోనని ఆశగా ఎదురు చూడడం. ఏదో రూపంలో వంగపండు వస్తాడేమో…. ఆశగా ఉంది…. ఆబగా ఉంది.. ఆలంబనగా కూడా ఉంది.











