ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఇదే కేసులో IAS అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసు నుంచి ఆమెకు రిలీఫ్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం 2022లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. శ్రీలక్ష్మి దాఖలుచేసిన డిశ్ఛార్జి పిటిషన్లో హైకోర్టు ఏకపక్షంగా తీర్పును వెలువరించినట్లు CBI చేసిన వాదనలను పరిగణనలోకి ఈ నిర్ణయం వెలువరించింది. శ్రీలక్ష్మి పిటిషన్ను హైకోర్టు మళ్లీ విచారించి, మెరిట్స్ ప్రాతిపదికన నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల గడువు విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ రాజేష్బిందల్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
CBI స్పెషల్ కోర్టులో పిటిషన్
OMC అక్రమ మైనింగ్ కేసులో CBI సమర్పించిన ఛార్జిషీట్లో తన పేరు లేకున్నా, ఆ తర్వాత అనుబంధ ఛార్జిషీట్లో 6వ నిందితురాలిగా చేర్చడాన్ని సవాల్చేస్తూ శ్రీలక్ష్మి హైదరాబాద్లోని CBI ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. 2006 మే 17 నుంచి 2009 అక్టోబరు 10 వరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో తాను అధికార దుర్వినియోగానికి పాల్పడి కుట్రపూరితంగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రెండు మైనింగ్ లీజులు కట్టబెట్టినట్లు CBI మోపిన అభియోగాలను ఆమె అందులో సవాలు చేశారు. శ్రీలక్ష్మి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిందితులకు అక్రమంగా మైనింగ్ లీజులు ఇవ్వడానికి సహకరించారని,ప్రభుత్వాన్ని మోసం చేశారని CBI చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆమె డిశ్ఛార్జి పిటిషన్ను 2022 అక్టోబరు 17న కొట్టేసింది. దీనిపై శ్రీలక్ష్మి చేసుకున్న అప్పీల్ను తెలంగాణ హైకోర్టు విచారించింది.
CBI ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను కొట్టేస్తూ 39 పేజీల తీర్పును న్యాయమూర్తి జస్టిస్ సుమలత వెలువరించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇతర నిందితులతో కుమ్మక్కయినట్లు కానీ, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడానికి ఒప్పందం చేసుకున్నట్లు కానీ ఛార్జిషీట్లలో ఎక్కడా కనిపించలేదని, అందువల్ల CBI కోర్టు ఉత్తర్వులను కొట్టేయడంతోపాటు, ఆమెపై CBI నమోదు చేసిన కేసులన్నింటి నుంచి విముక్తి కల్పిస్తున్నట్లు 2022 నవంబరు 8న తీర్పు వెలువరించారు.
హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ CBI 2023 ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని CBI తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ ధర్మాసనానికి విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును మెరిట్స్ ప్రాతిపదికన తొలి నుంచీ మళ్లీ విచారించి మూడు నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది.