సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక తిరిగి వాటి గురించి అడిగేందుకు, కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు జగన్కు ఎలాంటి హక్కులు లేవన్నారు సరస్వతి సంస్థ తరఫు న్యాయవాది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్కు నివేదించారు.గిఫ్ట్ ఇచ్చాక ఏకపక్షంగా అవగాహన ఒప్పందం రద్దు కుదరదని, దీనికి ఇరుపక్షాలు అంగీకరించాల్సి ఉందని విజయమ్మ తరఫు న్యాయవాది నివేదించారు. NCLTలో సెక్షన్ 59 కింద పిటిషన్ వేసి వివాదం చేయడంలో జగన్ది కుటిల ప్రయత్నమన్నారు.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు దాఖలు చేసిన పిటిషన్పై NCLT జ్యుడీషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ మెంబర్ సంజయ్ పూరిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సరస్వతి పవర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాటాల బదలాయింపు ప్రక్రియ కంపెనీ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుందన్నారు. బాండ్ను నోటరైజ్ చేసి అందించిన తరువాతే వాటాల బదలాయింపు జరిగిందని చెప్పారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషనర్ కుటుంబ వివాదంతో సంబంధం లేకుండా, కంపెనీ చట్టప్రకారం విధులు నిర్వహించాలి కదా అని ప్రశ్నించింది. వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని న్యాయవాది చెప్పారు. 2021 జూన్ 14న వాటాల బదలాయింపునకు విజయమ్మ లేఖ ఇచ్చారన్నారు. జులై 2న బాండ్ సమర్పించినా దాన్ని నోటరైజ్ చేయలేదని, జులై 5న నోటరైజ్డ్ బాండ్ సమర్పించారని చెప్పారు. జగన్ వాటాలను తల్లి పేరుతో బదలాయించారని, ఆమె హక్కుదారని వివరించారు. జులై 26న గిఫ్ట్డీడ్ ఇచ్చారన్నారు. జగన్ చెల్లిపై ప్రేమ లేదంటున్నా తల్లిపై ఇప్పటికీ ప్రేమ, వాత్స్యలం ఉందనే చెబుతున్నారని గుర్తు చేశారు. జగన్, భారతిరెడ్డి బోర్డు డైరెక్టర్లుగా రాజీనామా చేసి వెళ్లిపోయాక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్నారు. గిఫ్ట్డీడ్ చెల్లదని జగన్ అంటున్నారని, దీని చట్టబద్ధతను సివిల్ కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు.
వాటాల బదలాయింపుపై కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద పిటిషన్ వేయడానికి తగిన కారణం చూపాల్సి ఉందని విజయమ్మ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్రెడ్డి తెలిపారు. క్లాసిక్ రియాల్టీ తగిన ప్రతిఫలం తీసుకున్నాక సండూర్ పవర్లోని 62 వేలకు పైగా వాటాలను విజయమ్మకు బదలాయించిందన్నారు. ఒకసారి ప్రతిఫలం తీసుకుని వాటాలను బదలాయించాక, గిఫ్ట్డీడ్ అమలయ్యాక ఇక్కడ పిటిషన్ వేయడానికి వీల్లేదని చెప్పారు. తగిన కారణం లేకుండా దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరారు.
జగన్ వాదన ఇది –
గిఫ్ట్డీడ్ పూర్తికాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందన్నారు జగన్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి . 2021 జూన్ 2నాటి సరస్వతి యాన్యువల్ రిటర్న్స్ ప్రకారం సండూర్పవర్, క్లాసిక్ రియాల్టీలోని వాటాలను తల్లి విజయమ్మకు బదలాయించడంతో ఆమె వాటా 48.99 శాతానికి చేరిందన్నారు. ఈ బదలాయింపుపై ఎలాంటి వివాదం లేదన్నారు. గత ఏడాది జులై 6న జగన్కు చెందిన మొత్తం వాటాలను వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్రెడ్డిల పేరుతో బదలాయించారు. 2న జరిగినదాన్ని జులై 6న జరిగినట్లు పేర్కొన్నారు.
తరువాత వాటాల సర్టిఫికెట్లు కనిపించడం లేదంటూ విజయమ్మ జులై 5న, జనార్దన్రెడ్డి 6న అఫిడవిట్లు సమర్పించారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారంలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించింది. అయితే జగన్ స్వార్జితం నుంచి చెల్లికి ప్రేమతో కానుక ఇవ్వాలని భావించి ఎంఓయూ చేసుకున్నారు. చెల్లి రాజకీయాల్లో వ్యతిరేకపక్షంలో చేరి తనపై ఆరోపణలు చేయడంతో జగన్ ఎంఓయూను రద్దు చేసుకున్నారు. ఆస్తి బదలాయింపు చట్టం సెక్షన్ 122 ప్రకారం భౌతికంగా వస్తువులను అందజేసినప్పుడే గిఫ్ట్ పూర్తయినట్లని చెప్పారు. వాదనలన్నీ విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.